2, ఆగస్టు 2010, సోమవారం

ఛందస్సు

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడ అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడ ఉన్నది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు


వేద ఛందస్సు:

వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము మరియు పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.

ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్యశాస్త్రములోని 15వ అధ్యాయము మరియు బృహత్‌సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.

తెలుగు ఛందస్సు:

తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.


గురువులు, లఘువులు:

ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉన్నది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు


గురువు, లఘువు, విభజించడము:

ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులొ మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, ల లు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అందురు.



కొన్ని నియమాలు:
1.దీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I
2."ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔను లో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
3.ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడి లో సం గురువు, అంత:పురము లో త: అనునది గురువు )
4.సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మ లో అ గురువు, భర్త లో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
5.ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ , మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
6.ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సంధర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమ లో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
7.పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు" లో "సెన్" గురువు)


గణాలు:

గణాలు అనగా, రెండు లేక అంత కంటే ఎక్కువ అక్షరాల గురు లఘు నిర్ణయాన్ని బట్టి వాటిని ఏదో ఒక (గ్రూపు)విభాగము లో ఉంచుతారు, దీనినే ఏదో ఒక గణము అని అంటారు.


రెండక్షరాల గణాలు:

మొత్తము ఉన్నవి రెండు రకాల అక్షరాలు గురువు, లఘువు; రెండక్షరాల గణాలు మొత్తము నాలుగు వస్తాయి (బైనరీ 0, 1 కాంబినేషన్లు తీసుకున్న 00, 01, 10, 11 వచ్చినట్లు) ఆ నాలుగు రెండక్షరాల గణాలు:

1.లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
2.లగ IU ఉదా: రమా
3.గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
4.గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు:

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో య తో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. య తో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, గురువు, గురువు IUU అలాగే రా తో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

1.ఆది గురువు భ గణము UII
2.మధ్య గురువు జ గణము IUI
3.చివరి గురువు స గణము IIU
4.సర్వ లఘువులు న గణము III
5.ఆది లఘువు య గణము IUU
6.మధ్య లఘువు ర గణము UIU
7.చివరి లఘువు త గణము UUI
8.సర్వ గురువులు మ గణము UUU
ఇవి మూడక్షరముల గణములు


ఉపగణాలు:
ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనం లో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

1.సూర్య గణములు
1.న = న = III
2.హ = గల = UI
2.ఇంద్ర గణములు
1.నగ = IIIU
2.సల = IIUI
3.నల = IIII
4.భ = UII
5.ర = UIU
6.త = UUI
3.చంద్ర గణములు
1.భల = UIII
2.భగరు = UIIU
3.తల = UUII
4.తగ = UUIU
5.మలఘ = UUUI
6.నలల = IIIII
7.నగగ = IIIUU
8.నవ = IIIIU
9.సహ = IIIUI
10.సవ = IIUIU
11.సగగ = IIUUU
12.నహ = IIIUI
13.రగురు = UIUU
14.నల = IIII
పద్య లక్షణాలు



వృత్తాలు:
గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు కలవు.

1.చంపకమాల
2.ఉత్పలమాల
3.శార్దూల విక్రీడితము
4.మత్తేభ విక్రీడితము
5.తరళం
6.తరలము
7.తరలి
8.మాలిని
9.మత్తకోకిల


జాతులు:
జాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.

1.కందం
2.ద్విపద
3.తరువోజ
4.అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)


ఉప జాతులు

1.తేటగీతి
2.ఆటవెలది
3.సీసము (పద్యం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి