11, ఏప్రిల్ 2011, సోమవారం

శ్రీరామనవమి

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామాయణం లో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర,కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే భాద్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్ర కు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్యకు రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.

ఉత్సవంలో విశేషాలు

ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.
ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.
ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).[ఆధారం కోరబడినది]
దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.
భద్రాచలం లో రామదాసు చే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది.


రామ రాజ్యం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైక కు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు

శ్రీరామనవమి శుభాకాంక్షలు!


సమస్త తెలుగు బ్లాగు లోకానికి శ్రీ రామనవమి పర్వదిన శుభాకాంక్షలు.

రామ రామ భద్రాచల

నీలాంబరి రాగం ఆది తాళం

ప: రామా రామా భద్రాచల రామా రార రామ రామ || రామ ||

చ1: రామా రారా నీమోమిపుడే - ప్రేమతీర చూతుగాని
తామసము వలదు రామ - స్వామి తాళజాలనికను || రామ ||

చ2: ఎన్నడు నే నిన్ను నమ్మి - యున్న వాడనని యెంచి
కనులెత్తి చూచి నన్ను - మన్ననతో బ్రోవ రాదా || రామ ||

చ3: మాటి మాటికి నీతోటి - సాటి వేల్పులు లేరని
చాటుచున్న నన్ను నీవె - పాట్లుపెట్ట నీటగునటరా || రామ ||

చ4: భద్రగిరి రామదాస పాలకుడవై నీవేల
ఛిద్రములెల్ల తొలగించి భద్రముగ నన్నేల వేల || రామ ||

ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా

ఆహిరి రాగం త్రిపుట తాళం

ప: ఇనకుల తిలక ఏమయ్య రామయ్యా
శ్రీరామచంద్రా విని వినకున్నావు
వినరాదా నామొర శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 1: కనకాంబరధర కపటమేలనయ్యా
శ్రీరామచంద్రా జనకాత్మజా రమణా
జాగుసేయకు శ్రీరమచంద్రా || ఇనకుల ||

చ 2: దశరథసుత నాదశ జూడవయ్యా
శ్రీరామచంద్రా పశుపతి నుతనామ
ప్రార్థించి మ్రొక్కెద శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 3: నేవే గతియని నెర నమ్మియున్నాను
శ్రీరామచంద్రా కావవే యీవేళ
కాకుత్స కులతిలక శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 4: వైకుంఠవాసుడ విని బాధ మాన్పవే
శ్రీరామచంద్రా నీ కంటె గతిలేరు
నిర్దయజూడకు శ్రీరామచంద్రా || ఇనకుల ||

చ 5: రామభద్ర శైలధామ శ్రీరామ
శ్రీరామచంద్రా వేమరు వేడెద
రామదాసుని బ్రోవ శ్రీరామచంద్ర || ఇనకుల ||

అంతా రామమయం బీ జగమంతా రామమయం

వరాళి రాగం ఆది తాళం

ప: అంతా రామమయం బీ జగమంతా రామమయం || అంతా ||

చ1: అంతరంగమున ఆత్మారాము డ
నంత రూపమున వింతలు సలుపగ || అంతా ||

చ2: సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా ||

చ3: అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా ||

చ4: నదులు వనంబులు నానా మృగములు
విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా ||

చ5: అష్ట దిక్కులును ఆదిశేషుడును
అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా ||

చ6: ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారక నామము || అంతా ||

22, జనవరి 2011, శనివారం

నాకు నచ్చిన అన్నమయ్య కిరీటి

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల

కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల....


వివరణ
=====
ఆన్నమాచార్యులవారు భగవంతుదు చేసే ఈ జగత్ సృష్ఠి రక్షణ ప్రళయములను ఒక ఉయ్యాల ఆటతో పోల్చుచున్నారు।చంచలస్వభావము కలిగిన జీవాత్మలకు ఈ ఉయ్యాలలో నుండుట అలవాటైనది।జీవులు పీల్చే ఉఛ్ఛ్వాసములో నీభావము తెలుస్తు ంది। ఉఛ్చ్వాసము ఓంకారము। ఓంకారమునందు నారాయణుడు సర్వనిర్వాహకుడని, అతనికి జీవాత్ముడు దాసుడని , జీవాత్ముని లక్షణమదే అని, దాస్యమవలంబించిన జీవాత్ముడు ముక్తి కర్హుడై పరమాత్మతో యావత్కాలమును సుఖించుననే భావము గర్భితమై యున్నది।ఇది ఈ ఉయ్యాలలోనిదే।

సూర్యుడుదయించు అస్త మించు రెండు కొండలును స్తంభములయితే నక్షత్రమండల మంతయును ఈ ఉయ్యాలను మోయుచున్నది। ఈ ఉయ్యాలకు ఆకాశము అడ్డదూలము। కనుక నీ ఉయ్యాల సమస్త ప్రపంచమును నిండియున్నది।


ఉయ్యాలకు నాలుగు వేదములను బంగారు గొలుసులు।(జగత్ క్రియా కలాపములకు వేదములే ఆధారము) ఉయ్యాల పట్టి సంఖ్యాశాస్త్రము।(మూడు లోకములు , సప్తకుల పర్వతములు, త్రిగుణములు , అరిషడ్వర్గములు, చతుర్దశవిద్యలు మొదలయిన వ్యవహార మంతయు సంఖ్యాశాస్త్రము మీదనే ఆధారపడినది కనుక ఆ పట్టి సంఖ్యాశాస్త్రము)। ధర్మదేవత పీఠము।


మేఘమండలము మేలు కట్లు (బందుకట్లు)। ఈ ఉయ్యాల మెరుగుకు మెరుగు (చాలా మేలయినది)। నల్లని కొండలవంటి నీ మేని కాంతికిది నిజమైన ఆభరణము।(స్వామి యొక్క మేనిపైననే జగత్తులాధారపడియున్నవి, కనుక ఇవియే స్వామికి నగలు)।


స్తనములు కదులుచుండగా, పైటకొంగులు రాచుకొణగా స్త్రీలు ఊపే ఉయ్యాల ఇది।(భగవంతుడూపే ఈ ఉయ్యాలకు బ్రహ్మాది దేవతలు తక్కిన జీవాత్మలు కూడ సహాయ భూతులు కనుక వారు ఊపే ఉయ్యాల ఇది। అయితే వీరందరూ స్త్రీలు।"స్త్రీప్రాయమితరంజగత్ = భగవంతుడొక్కడే స్వతంత్రత కలిగిన పురుషుడు తక్కిన వారందరు భగవంతునకు పరతంత్రులు కనుక స్త్రీలే" అని శాస్త్ర నిర్ణయము। వీరు కూడ ఈ ఉయ్యాల నూపుచున్నరు కదా) ఆ స్త్రీలు బ్రహ్మాండములన్నీ ఒరిగిపోతాయనే భయంతో ఊపుచున్నారు।(జగత్ క్రియలను భగవంతుడు నిర్భయంగా చేస్తాడు , తక్కిన వారు పరతంత్రులు కనుక భయంతో చేస్తారు।)


ఈ ఉయ్యాలలో నున్న శ్రీదేవి భూదేవి ప్రతి కదలికకు నిన్ను కౌగిలించుకొందురు కదా ! స్వామీ ! దేవతా స్త్రీలకు ఈ ఉయ్యాలలోనే నీ హావభావ విలాసములు తెలుస్తాయి।


బ్రహ్మాదులకు కూడ ఇది ఆశ్చర్యకరమై వర్ణింపనలవి కాదు। కన్నుల పండువయినది। ఓ వేంకటేశ్వరా ! ఈ ఉయ్యాల ఊపుట నీకు వేడుకయిన లీల।(స్వామికు వైకుంఠము భోగము కొరకని తక్కిన లోకములు లీల కొరకని సంప్రదాయము ) ఈ పదము అన్నమయ్య గారి భావుకతకు నిదర్శనము।

http://annamacharya-lyrics.blogspot.com/search/label/lali%20patalu

click here listen song ::

17, డిసెంబర్ 2010, శుక్రవారం

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

రాక్షసగుళ్ళు(కెయిరనులు)

తెలుగు భాష మరియు ప్రాచీన ఆంద్రుల సంస్కృతీ,విశేషాలు గురించి మనకు రకరకాల ఆధారాలు ఉన్నవి .అవి శాసనాలు,నాణేలు,సాహిత్య ఆధారాలు,కైఫీయతులు,కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు మొదలైనవి.అందులో కెయిరనులు లేదా రాక్షసగుళ్ళు గురించి తెలుసుకుందాం.


కెయిరనులంటే పూర్వకాలపు సమాధులు .భుగర్బాన్ని తవ్వడం వళ్ళ ఇవి బయల్పడుతాయి.కేయిరనులు రాయలసీమలోనూ,తెలంగాణా ప్రాంతాలలోను ఎక్కువగా కనిపిస్తాయి.ఒక పెద్ద గుంతతీసి,అందులో రాతి పలకలతో చిన్న చిన్న ఇళ్ళలాగా నిర్మించి,దాంట్లో శవాన్ని ఉంచటం ప్రాచీన ఖనన పద్దతి.మరణించిన వాళ్ళ విశ్వాసాలకనుగుణ౦గా వస్తు సామాగ్రిని సమాధిలో ఉంచి దాన్ని మట్టితో పూడ్చివేస్తారు.సమాదిచుట్టు వలయాకారంగా పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చుతారు.వీటిని చూచి ప్రజలు ఆశ్చర్యపడి వీటికి "రాక్షసగుళ్ళు" అని పేరు పెట్టినారు.బేగంపేట్,మౌలాలి,రాయగిరి,మానుకోట,డోర్నకల్లు,మధిర మొదలైన ప్రాంతాలలో కేయిరన్లు ఎన్నో కనిపించాయి.వాటిల్లో వివిధ పరిమాణాలున్న కుండలు కనిపించాయి.ఆ కుండలపయిన కొన్ని సంకేత చిహ్నాలు ఉన్నాయి.అలాంటి చిహ్నాలు మొహంజోదారోలోని ప్రాచీన నాణాలమీద కూడా కనపడుతున్నాయి.కేయిరన్లలో తూర్పున గొడ్డలి,పడమట మట్టి పాత్ర,ఉత్తరాన రాగి గిన్నె,దక్షిణాన కుండలు ఉంచేవారు. మౌలాలి కేయిరన్లలో అందమైన కట్టి దొరికింది.అందులో మృత పురుషుడు వీరుడు అయి ఉండవచ్చు.డోర్నకల్లు సమాధిలో కొడవలి దొరికింది.అతడు కృషీవలుడు అయి ఉంటాడు.


రెండువేల సంవత్సరాలకు పూర్వమే రాయలసీమ,తెలంగాణా ప్రాంతాలల్లో నాగరికత తెలిసిన ప్రజలు ఉండేవారని కేయిరన్లను బట్టి తెలుస్తుంది.అప్పటి మనుషులు అయిదున్నర,ఆరడుగుల పొడవున్దేవారు.వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పరుచుకొని వ్యవసాయం మొదలయిన వృత్తులను అవలంబించినారు.వాళ్ళలో నేర్పరులయిన కమ్మరులు,కుమ్మరులు కుడా ఉండేవారు.వాళ్ళు చక్కని పనిముట్లను తయారు చేసేవారు.ఆ కాలపు శిల్పులు పెద్ద పెద్ద బండరాళ్ళను మలిచే నేర్పు కలిగి ఉండేవారు.వారి వస్తు పరిజ్ఞానం కూడా ఎన్నదగినది.వాళ్లకు పునర్జన్మఫై నమ్మకమున్నట్లు తోస్తుంది.ప్రాచీనా౦ద్రుల సంస్కృతీ ,విశేషాలు తెలుసుకోటానికి ఈ కెయిరనులు తోడ్పడతాయి.


30, ఆగస్టు 2010, సోమవారం

దిగంబర కవిత

సామాజిక సాహిత్య రంగాల్లో ఏర్పడ్డ స్తబ్దతను బద్దలుగోట్టే ఉద్దేశ్యంతో దిగంబర కవులు ఆవిర్భవించారు.పాత వ్యవస్తలోని అనేక విలువలను వీరు ప్రశ్నించారు .౧౯౬౫(1965)లో ప్రారంబమయి ౧౯౬౮(1968)వరకు మూడేళ్ళపాటు చెలరేగిన వీరి తిరుగుబాటు తెలుగు సాహిత్యరంగంలో సంచలనం కలిగించింది.


ఆరుగురు యువకులు ఒకచోట చేరి విచిత్రమైన కలం పేర్లతో దిగంబరకవిత్వాన్ని ఔద్దత్యంతో వెలువరించారు.అవి

౧.నగ్నముని-(కేశవరావు)
౨.నికిలేశ్వర్-(యాదగిరిరెడ్డి)
౩.చెరబండరాజు-(బద్దం భాస్కర్రెడ్డి)
౪.మహాస్వప్న-(కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు)
౫.జ్వలాముకి-(వీరరాగవాచార్యులు)
౬.భైరవయ్య-(మన్మోహన్ సహాయ్)


"ఈదేశంలో ,ఈ భూగోళంలో ఉపిరిపీల్చే ప్రతిమనిషి కోసం తపనపడి,భాదను చూసి వెక్కి వెక్కి ఏడ్చి ,పిచ్చేత్తి ప్రవచించిన కవిత్వం అని తమ కవిత్వ హేతువును గురించి చెప్పుకున్నారు.జీవచ్చవాలుగా బ్రతుకుతున్న ప్రజలను కోప్పడి,తిట్టి,భయపెట్టి,జుగుప్స కలిగించిన కవిత్వం దిగంబర కవులది.రాసింది వచన కవిత అయినా వీరు తమ కవితలను 'దిక్' అని పిలిచారు.దిగంబరశకం అనే కాలమానాన్ని కూడా ప్రకటించారు.సంవత్సరాలు,ఋతువుల పేర్లుమార్చారు.ముడుసంపుటాలు మాత్రమే వెలువరించి ముడేల్లలోనే దిగంబరశకం ముగిసింది.


నేటి సమాజంలో దుర్భర పరిస్థితులకు కారణమనుకున్న అందరిని దిగంబర కవులు తిట్టారు.స్వేచ్చా మానవుడి కోసం తపిస్తున్నామన్నారు.నేటి సమాజం కుష్టు వ్యవస్థగా మారిందని దీన్ని నాశనం చేయ్యాలనేకాకుండా 'ఏ ఆచ్చాదనకి తలోగ్గని ,ఏ భయాలకి లొంగని నిరంతర సజీవ మానవుని కోసం ఎలుగెత్తి పిలుస్తున్నాం'అన్నారు.


నగ్నముని రచించిన 'తోడవిరిగిన తరం'లో నిజం రెజర్ లాంటిది.అది సీజర్ని క్షమించదు.'అని హెచ్చరించాడు .చెరబండరాజు 'ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది'అనే కవితలో.


"పుడమి తల్లి చల్లని గుండెను
పాయలు పాయలుగా చీల్చుకొని
కాల్వాలయి ఎవరిదో
ఏ తరం కన్నీరో
గలగల సుళ్ళు తిరిగి
మెల్లమెల్లగా పారుతుంది" అని వరదనీ వర్ణించాడు.


మహాస్వప్న 'మేం మనుషులం కాదు ఇంకేదో పేరుంది మాకు'అంటూ బాపు!మోసపోలేదు కదా నువ్వు'అని గాంధీని సంబోదిస్తూ భాద పడతారు.


"అన్నా ! భయపడకు
కరువు భత్యం పెరుగుతుంది.
కొండచిలువ నోట్లోకి ఈగపిల్ల దూకుతుంది ' అంటూ ప్రభుత్వాన్ని నమ్మిమోసపోవద్దని బైరవయ్య హెచ్చరించారు. రాచమల్లు రామచంద్రారెడ్డి వీరిని అరిషడ్వర్గాలతో పోల్చారు.౧౯౭౦(1970)లో విప్లవ రచయితల సంఘంలో చేరారు.వీరి సంస్థాపన తర్వాత దిగంబర కవిత్వం అంతరించిన్నట్లు భావించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన భాషల వ్యాప్తి

ఆంధ్రప్రదేశ్ లో పెక్కు తేగల గిరిజనులు నివసిస్తున్నారు.వారు మాట్లాడే భాషలు కూడా చాల ఉన్నాయి.
వీటిలో కొన్ని భాషలను లక్షలమంది మాట్లాడుతుండగా కొన్ని భాషలను వందలమందే మాట్లాడుతున్నారు.గిరిజనులు ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ జిల్లాలలో ఉన్నారు.ఆదిలాబాద్ జిల్లాలోని ఏజన్సీ ప్రాంతాలలో "ఆద్,భిల్,గోండ్,కొలామ్,ప్రదాన్,తోటి"జాతులవారు అధిక సంఖ్యలో నివాసముంటున్నారు.ఖమ్మం వరంగల్ జిల్లాలలోని ఏజన్సీ ప్రాంతాలు 'కోయల' ప్రదాన నివాసభూమి.ఉభయ గోదావరి జిల్లాల మన్యప్రాంతాలలో 'కొండరేడ్లు'నివసిస్తున్నారు.విశాఖపట్నం ఏజన్సీ ప్రాంతాలలో బగత,మొండీ,దిగాయి,దులియా,ఝాడియా,కోబడి,కోతియో,మూనియా,మావి,మాలకల్,ముకదొర,పరంగి,పుంగు,రెడ్డిదొర,రోన,వాల్మీకి తెగలవారున్నారు.తూర్పు గోదావరి,విశాఖపట్నం,జిల్లాల ఎజన్సీలలో 'ఓజులు'వ్యాపించి ఉన్నారు.విశాఖ,శ్రీకాకుళం ఎజన్సీలలో -"గడబ,గౌడు,జాత,కొదు,కొండదొర,మన్నేదొర" తెగలవారున్నారు.కర్నూలు జిల్లాలో చెంచువారు,గుంటూరు,చిత్తూరు జిల్లాలలో కట్టునాయకన్ తెగలవారు విస్తారంగా ఉన్నారు.కోస్తా జిల్లాలలో;రాయలసీమ జిల్లాలలో ఏనాది,ఎరుకలవారు ఎక్కువగా ఉన్నారు.ఉత్తర తెలంగాణా జిల్లాలలో లంబాడి మరియు నాయక్ తెగలవారు ఉన్నారు.
ఆద్.భిల్ తెగలవారి భాషలగురించి భాషా శాస్త్రవేత్తలకుకుడా స్పష్టంగా తెలియదు.ఆద్ జాతివారు సుమారుగా ౧౨౦౦ (1200)మంది ,భిల్ జాతివారు ఒకవందమంది కంటే ఎక్కువ ఉండరు.
గోండీభాషను ఇటీవల పెక్కుమంది అధ్యయనం చేస్తున్నారు.గోండులు ప్రాచీన సంస్కృతీ కలిగిన జాతి దేవనాగరి ,మరాఠి,రోమన్,తెలుగు లిపులలో గోండి సాహిత్యం వెలువడింది.గోండిభాష మాట్లాడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.
కొలామి భాషలో సాహిత్యాన్ని అమెరికన్ భాషాశాస్త్రవేత్త ఎం.బి.ఎమీనో రోమన్ లిపిలో ప్రచురించాడు.కోయాభాషను కొందరు గోండి భాష మాండలికంగా తలచారుగాని అది ప్రత్యేకమైన భాషే.గోండి,కోయ భాషలలో అకాడమీ వారు వాచకాలను ప్రచురిస్తున్నారు.
'కొండరేడ్లు,దాదాపు ౪౦(40)వేలమంది ఉన్నప్పటికీ వారి భాష గురించిన వివరాలు తెలియవు.కొన్ని వందలమంది మాట్లాడే 'తోటి'జాతివారి భాషగురించి కూడా విశేషాలు తెలియవు.'బగత' తెగవారు సుమారుగా ఆరులక్షలమంది ఉన్నప్పటికీ వాళ్ళ భాషగురించి విశేషాలు తెలియవు.అలాగే దిదాయి,ధులియా,ఝులియా,కోబడి,కొటియా,మూలియా.మాలి మాలికర్ తెగలవారి భాషలగురించి కూడా శాస్త్రవేత్తలకు తెలియదు.ఇంకా ముకదోరాలు,పరంగి తెగలు,రెద్దిదొరలూ,రోనతేగా,వాల్మీకులు,గోడులు,జాతాపులు మొదలయిన వారి భాషలపయిన తగిన పరిశోదన జరుగలేదు.
గిరిజనులు మాట్లాడే భాషలలో కొన్నింటిని-పర్జీ,పెంగు మొదలయిన వాటిని ద్రావిడ భాషలుగా పరిశోదకులు గుర్తించారు.
చెంచులు సుమారు ౧౮(18)వేలమంది ఉన్నప్పటికీ వాళ్లభాష గురించి పరిశోదన ఇంకా జరుగలేదు.ఎరుకలభాషను తమిళభాషకు మాండలికంగా భాషాశాస్త్రవేత్తలు గుర్తించారు.సుగాలీలు లేక బంజారాలు మాట్లాడే భాషను రాజస్థానీ మాండలీకంగాతెలుసుకున్నారు.

గిరిజనుల భాషలను గురించి విస్తృతంగా పరిశోదనలు జరిగితెకాని అవి ఏయే భాషా కుటుంబాలకు చెందినవో చెప్పటం కుదరదు.గిరిజనులు మైదాన ప్రదేశాలకు వచ్చినప్పుడు తెలుగు నేర్చుకొని మాట్లాడటం తప్పటంలేదు.

28, ఆగస్టు 2010, శనివారం

లండన్ సంకల్పం



డాక్టర్ వెలుదండ నిత్యానందరావుగారు రచించిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" అనే పుస్తకంలో నుంచి ఒక పేరడీ -



"ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధేశ్వేతవరాహకల్పే...." అని సంకల్పం చెప్పుకోవటం అందరికీ తెలిసిందే కదా...ఇది ఆంధ్రదేశంలో ఉన్న ఆంధ్రులకి సరిపోతుంది. మరి లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా చెప్పుకుంటారు అని చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెలియచేస్తున్నారు



"లండన్ వే స్వాహా జూశసే స్వాహ - క్రైస్తవే స్వాహా - ఇంగ్లండ్ - స్కాట్లండ్ - ఐర్లండ్ తత్త్రైస్తోర్వరేణ్యం - జుహోవా దేవస్య ధీమహీ - ధియోయోనః ప్రచోదయాత్" తో మొదలు అయ్యి "భూమేః పూర్వగోళార్థే యూరప్ఖండే, రష్యా, జర్మనీ, ఫ్రాన్సు, స్వీడనేత్యాది మహాదేశానాం పశ్చిమ ప్రాంతే - చతుస్సముద్ర ముద్రిత గ్రేటుబ్రిటన్నామక మహాద్వీపే చవియట్పర్వతస్య దక్షిణ దిగ్భాగే - వేల్సుదేశస్యాగ్నేయభాగే బ్రిస్టల్కుల్యాయాః ప్రాగ్దేశే...అస్మిన్వర్తమాన వ్యావహారిక హూణమానేన క్రీస్తో రనంతరం వింశతి తమ శతాబ్దే ...అఖండ థేంస్ నద్యాం వీరభద్రశర్మాహం జ్ఞానస్నానం కరిష్యే" ఇలా సాగిపోతుంది..




source.maganti.com

ఆవకాయ పాట

స్వర్గీయ మల్లినాథ సూరి గారు (కృష్ణా పత్రిక) ఒక వేసవికాలం బంధువుల పెళ్ళికి వెళ్ళిరావటం, ఆ నెలలోనే ఆవకాయ, మాగాయ కూడా పెట్టించటం మూలాన ఖర్చు చాలా అయ్యిందిట.అప్పుడు వారు కట్టి పాడిన పాట



మున్నాళ్ళ పెళ్ళికి ముప్ఫైయ్యి వదిలాయి రామచంద్రా!!

రైలువాడికి ఇస్తి రానూపోనూ ఇరవై రామచంద్రా!!

పెట్టికూలికి పోయె పైనొక్క రూపాయి

బండ్లవాళ్ళకు ఇస్తి పధ్నాలుగణాలు !!రామ!!

ఇంటావిడకు కుట్టిస్తి వంటిమెడ రెవిక !!రామ!!

ఒక్క రెవికకి పట్టె రొక్కమ్ము రెండు

కుట్టువాడికి ఇస్తి గట్టిగా బేడాను !! రామచంద్రా !!

ఫేషన్ అనుకొని పక్కనున్న ఆమె

టిక్కట్టు నేకొంటి రామచంద్రా

టిక్కెట్టుకే పట్టె జాకెట్టు ఖరీదు !!రామ!!

ఆవకాయకు అయేనా అరవయ్యి రూకలు !!రామ!!

మాగాయకు పట్టె మరి ఇరవై రూకలు !!రామ!!

లక్ష్మయ్యకే ఇస్తి సాక్షాత్తు యాభయ్యి !!రామ!!

కారమూ, ఉప్పును ఇంట్లోనే కొట్టిస్తి !!రామ!!

కాయలు స్వయముగా

చేయి చేసి తరిగితి !!రామ!!

ఇంత చేసిన పిదప ఎవడో చుట్టమువచ్చి

వఱ్ఱగా తినిపోవు ఎవడబ్బ సొమ్మని !!రామ!!

కొట్టులోపల అప్పు జోకొట్టితే పోవునా !!రామ!!




source.maaganti.com

24, ఆగస్టు 2010, మంగళవారం

మన తెలుగు భాష వయసెంత?

క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని "గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.

క్రీ.శ. 200 లోని అమరావతి శిలాశాసనంలోని "నాగబు" పదంలోని "బు" ప్రత్యయాన్ని మొట్టమొదటి తెలుగు అక్షరంగా భాషా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడులో చెన్నకేశవస్వామి ఆలయంలో రేనాటి చోళుడైన ధనుంజయుడు వేయించిన శాసనం (క్రీ.శ.575-600) , కలమళ్ళ (క్రీ.శ.575-600) శాసనాలు మొట్టమొదటి శిలాశాసనాలుగా భావింపబడుతున్నాయి. అదేవిధంగా క్రీ.శ. 848లోని పండరంగని అద్దంకి శాసనం, యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనాల్లో పద్యాలున్నాయి.


ధనంజయుని కలమళ్ళ శాసనము

..........
కల్ము[తు]రా
జు ధనంజ
యుదు రేనా
ణ్డు ఏళన్
చిఱుంబూరి
రేవణకాలు [పం]
పు చెనూరుకాజు
అఱి కళా ఊరి [-]
ణ్డవారు ఊరి ... ...
... ....
..... ... పఞ్చ [మ]
హా పాతకస
కు


***ఎరికల్ మహారాజు ధనంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును - అని కావచ్చును

పండరంగని అద్దంకి శాసనము (క్రీ.శ. 848) - అద్దంకి

తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది.

పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.



యుద్ధమల్లుని బెజవాడ శాసనము (క్రీ.శ. 930) - విజయవాడ

స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
విస్తర శ్రీయుద్ధమల్లుం డనవద్య విఖ్యాతకీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
వస్తు సమేతుండు రాజసల్కి భూవల్లభుం డర్థి.


పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుడై గుడియు
నిరుమమమతి నృపధాము డెత్తించె నెగిదీర్చె మఠము
గొరగల్లా కొరులిందు విడిసి బృందంబు గొనియుండువారు
గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.



కొరివి శాసనం - (క్రీ.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట:

కొరివి గద్య శాసనము తూర్పు చాళుక్యులు మరియు రాష్ట్రకూటులకు చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్టమైన రచన దీనిలో కనిపిస్తుంది.

శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచకందర్పునకుం వేగీశ్వరునకు రణమర్దాన్వయ కులతిలకుండైన కుసుమాయుధుండు గన్నరబల్లహుని కస్తప్రాప్తంబైన రణమర్దన కండియందన భుజనీర్య బలపరాక్రమంబున దెచ్చి ... శ్రీ నిరవద్యుం డనేక సమరసంఘట్టన భుజాసి భాసురుడై తమయన్న రాజశ్రీకెల్లం దానయర్హుండై నిల్చి.


గూడూరు శాసనము - (క్రీ.శ. 1124) - జనగామ తాలూకా, గూడూరు

అరుదగునట్టి ఎఱ్ఱనృపు నంగన గామమ సాని యాక మే
ల్గరదని బేతభూవిభుని గాకతి వల్లభుచేసి వాని దా
బరగంగ జేతబెట్టి ఘను బల్లవరాయని యాగిజొచ్చె భా
స్కర విభు చక్రవర్తి గని కాకతి నిల్పుట కోటిసేయదే !



హన్మకొండ శాసనము (క్రీ.శ. 1163)


వేయి స్తంభాల గుడి లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడినది.

హస్త్యారోహణ కర్మ కర్మఠగతిం చాళుక్య చూడామణిం
శశ్వద్యుద్ధ నిబద్ధ గహ్యరమతిం యుద్ధే బబంధ క్షణాత్
కృద్ధేనోద్ధుర మంత్రకూటనగరీ నాథో థయో నిస్త్రపో
గుండః ఖండిత ఏవ ముండితశిరః క్రోడాంక వక్షఃస్థలః
కందూరోదయ చోడ వంశ విలసత్ క్షీరాబ్ధిగర్భోద్భవ
త్పద్మైకాశ్రయ రుద్రదేవనృపతేః కింవర్ణ్యతే విక్రమః


తెలుగు సాహిత్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలమైన 16వ శతాబ్దం స్వర్ణయుగం.

సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావజాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది.

"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స" అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.

చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.

తెలుగులో 20వ శతాబ్దంలోనే ఎక్కువ సాహిత్యం వచ్చింది. ఇంతకుముందులేని సాహిత్య ప్రక్రియలెన్నో ఈ శతాబ్దంలో వికసించాయి. అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు చెందినవారు రచయితలయ్యారు.

అనేకమంది కవుల కృతులతో ఆంధ్ర భాష అలరారింది. ఆచార్య భద్రిరాజు క్రుష్ణమూర్తి ఆధ్వర్యంలో 1,08,330 పదాలతో కూడిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం 8 సంపుటాలుగా ఆంధ్ర యూనివర్సిటిచే ప్రచురించబడింది. ఇంగ్లీషు తరువాత తెలుగు భాషకే ఇంతటి కోశ సంపద ఉంది.

తెలుగు భాష ఎలా పుట్టింది?


సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాక్రుత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాక్రుతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని "తెలుగు" శబ్దం ఏర్పడి ఉండవచ్చని సొమయాజి గారు తెలిపారు. "తెలుగు" దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.

"తలైంగు" జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. "తలైంగు" అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.

"తెలుంగు" అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. "తెన్ను" అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.

"తెన్" నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. "తెన్" అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి "తెనుగు" అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.

ఐతే "త్రినగ" నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా "త్రినగ" శబ్దం ఏర్పడిందంటారు.

మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.

విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా "త్రిలింగ" పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గరు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.

ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.

పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ "వడుగ", "వడగ", "తెలింగ", తెలుంగు" అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.

23, ఆగస్టు 2010, సోమవారం

"నాగబు" కధ

వివరాలలోకి వెళ్లేముందు ఈ "నాగబు" చరిత్రని కనుక్కోమని నాలో దీనిని గురించిన ఆసక్తి కలిగించిన వేణు గారికి ధన్యవాదాలు.

అమరావతి స్తూప శిథిలాలలోని రాతి పలక మీద కనిపించిన 'నాగబు' అనే మాటను తెలుగు ప్రాచీనతను గురించి చెప్పటానికి ఉట్టంకిస్తూ ఉంటారు. పగిలిన ఆ రాతి పల క మీద ఉన్నది నాగబు అన్న ఒకే ఒక మాట. ఇది పూర్తిగా తెలుగు మాట కాదనీ, నాగ అనే సంస్క­ృత ప్రాతిపదిక మీద 'బు' అనే తెలుగు ప్రత్యయం చేరగా ఏర్పడి నది అని కూడా చెప్తారు. నాగబును తెలుగు పదం అని మొదటిసారిగా గుర్తించినవారు వేటూరి ప్రభాకర శాస్త్రి. అయితే దీన్ని పురాతత్వవేత్తలు సమర్థించరు. అమరావతిలో దొరికిన శాసనాల లో చాలాచోట్ల 'నాగబుధనికా' 'నాగబుధనో' వంటి పేర్లు కనిపిస్తాయని, 'నాగబు' అనే మాట తో దొరికినది ఒక రాతి ముక్క అని, అది 'నాగబుధనో' లేదా ' నాగబుధనికా' వంటి మాట కల శాసన శిల పగిలిపోగా 'నాగబు' అన్న భాగం మాత్రమే ఉన్న ముక్క మనకు లభించి ఉండవచ్చ నీ వారు అంటారు. అయితే వేటూరి వారి అభిప్రాయాన్ని పూర్తిగా కొట్టిపారవేయలేము. ఎందు కంటే నివబు (నెపము), వక్రబు, పట్టణబు వంటి మాటలు మనకు 575 నించి దొరుకుతున్న తెలు గు శాసనాలలో కనిపిస్తూనే ఉన్నాయి. కనుక బు-ప్రత్యయం కల పదాలు ఆనాడు వాడుకలో ఉండేవి అనటానికి ఇవి సాక్ష్యం అవుతై. అందువల్ల నాగబు తెలుగు మాట కాదు అనలేము.

తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాధా సప్తశతి లో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉన్నది.


చరిత్ర, యుగ విభజన
కాలానుగుణ తెలుగు సాహితీ చరిత్ర కోసం తెలుగు సాహితీ చరిత్ర ను చూడండి.

తెలుగు సాహితీకారుల గురించిన మరిన్ని వివరముల కోసం తెలుగు సాహితీ కారుల ను చూడండి.


తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించ వచ్చును.


1.ప్రాఙ్నన్నయ యుగము : క్రీ.శ. 1000 వరకు
2.నన్నయ యుగము : 1000 - 1100
3.శివకవి యుగము : 1100 - 1225
4.తిక్కన యుగము : 1225 - 1320
5.ఎఱ్ఱన యుగము : 1320 - 1400
6.శ్రీనాధ యుగము : 1400 - 1500
7.రాయల యుగము : 1500 - 1600
8.దక్షిణాంధ్ర యుగము లేదా నాయకరాజుల యుగము : 1600 - 1775
9.క్షీణ యుగము : 1775 - 1875
10.ఆధునిక యుగము : 1875 నుండి


క్రీ.శ. 1000 వరకు - నన్నయకు ముందు కాలం:-

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. (కడప జిల్లా కమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది). అంతకు ముందు కాలానికి చెందిన అమరావతీ శాసనంలో నాగబు అనే పదం కనిపిస్తుంది.


1000 - 1100 : నన్నయ యుగము:


దీనిని "పురాణ యుగము" లేదా "భాషాంతరీకరణ యుగము" అని అంటారు. నన్నయ్య ఆది కవి. ఈయన మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని, ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ,నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.

1100 - 1225 : శివకవి యుగము

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది.

1225 - 1320 : తిక్కన యుగము


1320 - 1400 : ఎఱ్ఱన యుగము

1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది.

తిక్కన మరణానికి షుమారు 10 సంవత్సరాలముందు (1280 ప్రాంతంలో) ఎఱ్ఱన జన్మించి ఉంటాడు. ఎఱ్ఱన మరణం 1360లో జరిగిఉండవచ్చును. 1365-1385 ప్రాంతంలో జన్మించిన శ్రీనాధుడు తరువాతి యుగకవిగా భావింపబడుతున్నాడు.

ఆంధ్ర వాఙ్మయంలో ఆఖ్యాన పద్ధతిని నన్నయ, నాటకీయ పద్ధతిని తిక్కన ప్రారంభించినట్లే వర్ణనాత్మక విధానానికి ఎఱ్ఱన ఆద్యుడు. నన్నయ యొక్క శబ్దగతిని, తిక్కన యొక్క భావగతిని అనుసంధించి క్రొత్త శైలిని కూర్చిన మహానుభావుడు ఎఱ్ఱన. తెలుగుభాష పలుకుబడి, వాక్యనిర్మాణము ఈ కాలంలో ఆధునికతను సంతరించుకొన్నాయి. శ్రీనాధునివంటి అనంతరీకులు ముందుగా ఈ శైలినే అలవరచుకొని రచనలు సాగించారు.


1400 - 1500 : శ్రీనాధ యుగము:-


తిక్కన(13వ శతాబ్ది), ఎర్రన(14వ శతాబ్దం)లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి. అందువలననే ఈ కాలాన్ని పురాణ యుగము అంటారు.


ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధము అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధం, పోతన భాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కల్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణము కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం మనకు అందిన మొదటి రామాయణం.

ఈ కాలాన్నే "మధ్యయుగం" అని కూడా అంటారు.


1500-1600 : రాయల యుగము:

దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

1600 - 1775 : దక్షిణాంధ్ర యుగము:


కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.


1775 - 1875 : క్షీణ యుగము


1875 తరువాత - ఆధునిక యుగము:


1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో , షెల్లీ, కీట్స్, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు భావకవిత్వం అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.


మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రము తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), గిడుగు రామ్మూర్తి , కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం, వ్యావహారిక భాషా వాదము నకు దారితీసింది.


తెలుగు సాహితీ చరిత్ర - ముఖ్యమైన ఘట్టాలు:


స్త్రీల కోకిల కంఠములలో, కర్షక శ్రామికుల స్వేదంలో, జానపదుల సంతోషములలో, తెలుగువారి ఘనమైన పండుగలలో తెలుగు సాహితీ చరిత్ర మొదలయింది.
తరువాత క్రీ.శ తొమ్మిదవ శతాబ్దం నుండి శిలా శాసనాల కు ఎక్కింది.
క్రీ.శ పదకొండవ శతాబ్దములో ఆదికవి నన్నయ్య చేతిలో, ఆంధ్ర మహాభారతం రూపంలో ఆదికావ్య రచన మొదలయింది.
ఈ ఆంధ్ర మహాభారతము ను పద్నాలుగవ శతాబ్దాంతానికి తిక్కన, ఎర్రన లు పూర్తి చేసారు. ఈ ముగ్గురూ తెలుగు కవిత్రయము అని పేరుపొందినారు.
పదనేనవ శతాబ్దంలో గోన బుద్ధారెడ్డి రామాయణము ను తెలుగువారికి తెలుగులో అందించినాడు.
పదునేనవ శతాబ్దంలో బమ్మెర పోతనామాత్యుడు భాగవతము ను తేట తెలుగులో రచించి, తెలుగువారిని ధన్యులను గావించాడు.
పోతన కు సమకాలికుడైన శ్రీనాథ కవిసార్వభౌముడు తన ప్రబంధాలతో తెలుగుభాషకు ఎనలేని సేవ చేసాడు.
పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.
తెలుగు భాషకు బ్రౌను చేసిన సేవలు బహు శ్లాఘనీయమైనవి. "ప్రపంచంలోని తెలుగు ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాహితీ సంస్థలు అన్నీ కలిసి తెలుగు భాషకు చేసిన సేవ, బ్రౌను ఒక్కడే చేసిన సేవలో ఓ చిన్న భాగం కూడా కాదు" అంటారు.
ఆధునిక యుగంలోని గురజాడ అప్పారావు, వాడుక భాషా ఉద్యమనేతలు, శ్రీశ్రీ, ఇంకా ఎందరో మహానుభావులు వివిధ సాహితీ ప్రక్రియల ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేసారు, చేస్తున్నారు.


తెలుగు సాహిత్యంలో ముస్లిం కవులు రచయితలు:


తెలుగు సాహిత్యంలో ముప్ఫైకి పైగా శతకాలను ముస్లిం కవులు రాశారు.భక్తి, నీతి, తాత్విక, ప్రబోధాత్మక సాహిత్యంలో ముస్లిం కవులు శతకాలు రాశారు.తెలుగుముస్లిం కవులు రాసిన కొన్ని శతకాలు ;

ముహమ్మద్‌ హుస్సేన్‌
భక్త కల్పద్రుమ శతకం(1949) మొక్కపాటి శ్రీరామశాస్త్రితో కలసి రాసిన శతకం సుమాంజలి. హరిహరనాథ శతకము అనుగుబాల నీతి శతకము తెనుగుబాల శతకము

షేక్‌ దావూద్‌
1963లో రసూల్‌ ప్రభు శతకము అల్లా మాలిక్‌ శతకము

సయ్యద్‌ ముహమ్మద్‌ అజమ్‌
సయ్యదయ్యమాట సత్యమయ్య సూక్తి శతకము

ముహమ్మద్‌ యార్‌
సోదర సూక్తులు

గంగన్నవల్లి హుస్సేన్‌దాసు
హుస్సేన్‌దాసు శతకము-ధర్మగుణవర్య శ్రీ హుసేన్‌ దాసవర్య

హాజీ‌ ముహమ్మద్‌ జైనుల్ అబెదీన్‌
ప్రవక్త సూక్తి శతకము,భయ్యా శతకము

తక్కల్లపల్లి పాపాసాహెబ్‌
వేంకటేశ్వరుండు, బీబి నాంచారమ్మ బెండ్లియాడి మతమభేదమనియె హరి, ప్రమాణమైన వ్యర్థవాదాలేల? పాపసాబు మాట పైడిమూట

షేక్‌ ఖాసిం
సాధుశీల శతకము కులము మతముగాదు గుణము ప్రధానంబు దైవచింత లేమి తపముగాదు, బాలయోగి కులము పంచమ కులమయా, సాధులోకపాల సత్యశీల

షేక్‌ అలీ
గురుని మాట యశము గూర్చుబాట అనే మకుటంతో 'గురుని మాట' శతకం మానస ప్రబోధము శతకం

షేక్‌ రసూల్‌
మిత్రబోధామృతము అనే శతకం

ఉమర్‌ ఆలీషా
బ్రహ్మ విద్యా విలాసము. "తెలుగు సాహిత్యం-1984 వరకు ముస్లిముల సేవ" అనే సిద్ధాంతవ్యాసానికి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయ ఆచార్యుడు షేక్ మస్తాన్ గారికి 1991 లో నాగార్జున యూనివర్శిటీ లో పి.హెచ్.డి వచ్చింది.ఉర్దూ మాతృభాషగా గల ఎందరో ముస్లిములు కూడా తెలుగు సాహిత్యాన్ని ఉత్పత్తి చేశారు.సయ్యద్ నశీర్ అహ్మద్ "అక్షర శిల్పులు" పేరుతో 333 మంది ప్రస్తుత తెలుగు ముస్లిం కవులు రచయితల వివరాలతో పుస్తకం ప్రచురించారు.


తెలుగు సాహితీ పద్దతులు:


తెలుగుసాహిత్యములో ప్రపంచ సాహిత్యము లో వలెనే వివిధ రకరకాలైన పద్దతులు ఉన్నాయి. ముఖ్యముగా ఈ క్రింది విషయములు చెప్పుకొనవచ్చు.

1.జానపద సాహిత్యము
2.వచన కవితా సాహిత్యము
3.పద కవితా సాహిత్యము
4.పద్య కవితా సాహిత్యము
5.చంపూ సాహిత్యము
6.శతక సాహిత్యము
7.నవలా సాహిత్యము
8.చిన్న కథలు
9.అవధానములు
10.ఆశుకవిత
11.సినిమా సాహిత్యము


ప్రస్తుత పరిస్థితి, ఓ అవలోకనం:

ప్రస్తుతము విప్లవ సాహిత్యము, అవధానములు, ఇంటర్నెట్టు తెలుగు సాహిత్యము, వివిధ ఇజములు కు చెందిన సాహిత్యములు, నవలలు,టీ. వీ. సాహిత్యము, సినీ సాహిత్యము, రీ మిక్సులు, చిన్న కథలు వంటివి తెలుగు సాహిత్య ముఖ చిత్రాన్ని చాలా వరకు పూర్తి చేస్తున్నాయి

20, ఆగస్టు 2010, శుక్రవారం

కుమారీ శతకము

1. శ్రీ భూ నీళా హైమవ
తీ భారతు లతుల శుభవ తిగ నెన్ను చు స
త్సౌభాగ్యము నీ కొసగంగ
లో భావించెదరు ధర్మ లోల కుమారీ!

ధర్మపరురాలైన ఓ కుమారీ! శ్రీదేవియు, భూదేవియు,నీళాదేవియు,పార్వతీదేవియు,సరస్వతీదేవియు, నిన్ను మిక్కిలి సుగుణవంతురాలిగా ఎన్నుకొని మంచి ముత్తైదవతనమును, మనస్సులందు తమ తమ ఆశీర్వచనములను నీకు ఇచ్చెదరు గాక.




2. చెప్పెడి బుద్ధులలోపల
దప్పకు మొక టైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులన్
దప్పింతయు లేక మెలగ దగును కుమారీ!
ఓ కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములనొక్కటినైనను వదలక ఆచరింపుము. ధర్మయుక్తముగా మెప్పు పొంది ఇహపర దోషమిసుమంతైననూ లేకుండా మసలుకొనుము. నీకు శుభములు కలుగును.




3. ఆటల బాటలలోనే
మాటయు రాకుండన్ దండ్రి మందిరమందున్
బాటిల్లు గాపురములో
వాట మెఱిగి బాల! తిరుగ వలయున్ గుమారీ!

ఓ కుమారీ! ఆటపాటలయందు ఏ విధమైన పరుష వాక్యములు పలుకక, మాటపడక, పుట్తింట్లో ఉండేటపుడు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా నడచుకొనుము.




4. మగనికి నత్తకు మామకున్
దగ సేవ యొనర్చుచోటన్ దత్పరిచర్యన్
మిగుల నుతి బొందుచుండుట
మగువలకున్ బాడి తెలిసి మసలు కుమారీ!

ఓ కుమారీ! మెట్టినింట్లో మగనికి అత్తమామలకు సపర్యలు జేయుచు, వారిచే మెప్పు పొందునట్లు స్త్రీలు నడుచుకోవాలి. ఈ విషయము మదినందుంచుకొని మెలగుము.




5. పెనిమిటి వలదని చెప్పిన
పని యెన్నడును జేయరాదు బావల కెదుటన్
కనబడగ రాదు కోపము
మనమున నిడుకొనక యెపుడు మసలు కుమారీ!

ఓ కుమారీ! భర్త చెప్పిన మాట జవదాటరాదు. ఆయన వద్దని జెప్పిన పనిని ఎన్నడునూ చేయరాదు. బావలకెదురుగా కనబడరాదు. మనస్సునందు, కోపము ఉంచుకొనరాదు. ఎల్లపుడు అట్లే మెలగుము.




6. పరపురుషు లన్న దమ్ములు
వరుదే దైవంబు, తోడి పడుచులు వదినెల్
మఱదండ్రు నత్తమామలు
ధరన్ దల్లియు దండ్రియును దలంపు కుమారీ!

ఓ కుమారీ! అన్యులను అన్నదమ్ములుగా భావింపుము. పతియే ప్రత్యక్షదైవమని, తోడికోడళ్ళు, మఱదళ్ళు, అత్తమామలు వీరంతా తల్లిదండ్రులని తలంపుము.




7. పదములపై జెయివేయక
మదవతి పతిచెంత నిద్ర మరగినన్ జేతుల్
గదలంగనీక కట్టుచు
గదంగొని శిక్షించు యముండు కాక్ష గుమారీ!

ఓ కుమారీ! పతికి సేవచేయక, ఆయన కాళ్ళు వత్తక, యాతని వద్ద నిద్రించే పత్నుల చేతులను యముడు గట్టింగా కట్తి, గదతో మోటుగా శిక్షిస్తాడు.




8. తెచ్చినన్ దేకుండిన నీ
కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకు మీ
యొచ్చెము నీపై దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ!

ఓ కుమారీ! నీమగడు నీకు బెట్తినను, పెట్టకపోయిననూ, తెచ్చిననూ, తేకున్ననూ, అతనిని దూషించుట మిక్కిలి తప్పు. మగని దిట్టుట మగువకు మంచిది కాదు. ఐదవతనము హరించును. అందరిలో అపహాస్యం పాలు కాక దప్పదు. కావున మగని దిట్టక చరించుట మగువల విధి.




9.మఱదండ్రు వదినె లత్తలు
మఱదులు బావల కొమాళ్ళు మఱి పెద్దలు రా
నురవడిన్ బీటలు మంచము
లరుగులు దిగుచుండవలయు నమ్మ కుమారీ!

కుమారీ! ఇంటికి మఱదళ్ళు, వదినెలు, అత్తమామలు, మఱదులు, బావల పిల్లలు, పెద్దలు వచ్చినట్లైన గౌరవముతో దిగ్గున మంచము పైనుండి లేవవలెను సుమీ!




10. నోరెత్తి మాటలాడకు
మాఱాడకు కోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగక
మీఱకుమీ యత్తపనుల మెలగు కుమారీ!
ఓ కుమారీ! సలక్షణ యువతి నోరెత్తి మాట్లాడరాదు. కోఫము వచ్చిననూ బదులు పలుకరాదు. మర్యాదలను అతిక్రమింపరాదు. అత్తగారు చెప్పు పనులు నిర్వర్తించుట మిక్కిలి శ్రేయస్కరము. కావున నట్లే చరింపుము.




11.పతి పర కాంతలతో సం
గతి జేసిన నాదు పుణ్య గతి యిట్లనుచున్
మతి దలపవలయు లేదా
బతిమాలగవలయు గలహ పడక కుమారీ!



ఓ కుమారీ! నీ పతి పరస్త్రీలతో తిరుగుచున్నపుడు తెలివితేటలతో సౌమ్యముగా నీ దారికి తెచ్చుకొనుట నీ విధి. అంతే గాని కొట్లాడరాదు. "నా పుణ్యఫలమిట్టిది" అని మనసున దలంచి ఓర్పు వహించాలి.




12. తిట్టిన దిట్టక, కొట్టిన
గొట్టక, కోపించెనేని గోపింపక, నీ
పుట్టిన యింటికి, బాదము
పెట్టిన యింటికిని వన్నె పెట్టు కుమారీ!

ఓ కుమారీ! నీ భర్త నిన్ను తిట్టినచో నీవు మరల తిట్టకూడదు. కొట్టినచో ఎదురు తిరిగి కొట్టగూడదు. ఒక వేళ నీపై కోపించిన నీవు తిరిగి కోపపడకుము కుమారీ ! పుట్టింటికి, నీ అత్తవారింటికి కీర్తీ వచ్చునట్లు నడచుకో




13. పతి పాపపు బనిజెప్పిన
బతిమాలి మరల్చవలయు బతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతి లోపల సంశయంబు మాని కుమారీ!

ఓ కుమారీ! నీ మగడు చెపిన చెడు పనులను వలదని నెమ్మదిగా ప్రార్ధించి, వారించి, ఆ పని మానునట్లు చేయుము. నీ పతి వినకున్నచో అంతా మన మంచికేననుకొని సందేహములను వదలి పనిని నిర్వర్తించుము.




14. దబ్బరలాడకు కదిమిన
బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధి గలిగి యెం
దెబ్బెఱికము బూనక కడు
గొబ్బున జిత్తమున వాని గూర్పు కుమారీ!

ఓ కుమారీ! అబద్ధములు చెప్పకు. నీ భర్త కొట్టబోయినచో కేకలు పెట్టి అల్లరి పాలు కావలదు. ఏ పనినైనా అసహ్యించుకొనక మంచి బుద్ధితో వెంటనే ఆయా పనులను నెరవేర్పుము.




15. పతి భుజియించిన పాత్రను
మెతు కొక్కటియైన భార్య మెసంగుటికై తా
హిత మూనకున్న నది యొక
సతియే ? కడు బాప జాతి జగతి కుమారీ!

ఓ కుమారీ! భర్త భుజించిన పాత్రలో అతడు వదలిన ఒక్క మెతుకైననూ భార్య దినుట పతివ్రతా లక్షణమనబడును దీనినే భర్త చేసుకొన్న పుణ్యములలో భాగమును గ్రహించుటయని అర్ధము. భార్య దినిన పాత్రలో భర్త దినుటయనే ప్రశ్న లేదు గావున భార్య చేసుకొన్న పుణ్యములలో భాగమునకు భర్త రాడు. భార్య చేసికొన్న పుణ్యములు ఆమేకే చెందునని భావము. పతివ్రతా స్త్రీలు ఈ విధంగా నడచుకొనవలెను. అట్లు చేయని ఆడది ప్రపంచములో చెడ్డజాతి స్త్రీలతో చేరును. అనగా పాపిష్టురాలగును.




16. జపములు, గంగా యాత్రలు
దపములు, నోములును, దాన ఢర్మంబులు, పు
ణ్య పురాణము పతిభక్తికి
నుపమింపను సాటి రాక యుందు కుమారీ!

ఓ కుమారీ! పత్నికి పతియే ప్రత్యక్ష దైవము కావున జపతపాలు, గంగా తీర్థ యాత్రలు, నోములు, దానధర్మాలు, పుణ్యపురాణ కథా శ్రవణములు, మొదలగు పుణ్యకార్యములన్నియు నీ పతి తర్వాతనేయని తెలుసుకొనుము. కారణం నీ మగని పుణ్యములలో కొంత భాగమును నీవు అర్హురాలవయినావు కావున జ్ఞాన మెరిగి మసలుకొనుము. పతిభక్తి గొప్పదని తెలిసికొనుము.




17. ఇరుగు పొరుగిండ్లు కైనను
వరుండో, కాకత్తగారో, వదినెయో, మామో
మఱదియో సెలవిడకుండంగ
దరుణి స్వతంత్రించి పోవన్ దగదు కుమారీ!

ఓ కుమారీ! యవ్వనవతీ! నీ భర్త, వదినె, మామ, మరుదులు, వెళ్ళమని జెప్పింతే దప్ప పొరబాటున నైననూ పొరుగిండ్లకు పోవద్దు. ఎవరి ఆజ్ఞలేకుండా నీకు నీవై పొరుగిండ్లకు పోవుట పాతివ్రత్య లక్షణము కాదు.




18. కూతురు చెడుగై యుండిన
మాతది తప్పన్నమాట మది నెఱుగుదుగా
నీ తల్లిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయ గూడ దమ్మ కుమారీ!
ఓ కుమారీ! కూతురు తప్పు చేయుట తల్లి దప్పుయని నీకు తెలుసు కదా! కవున నీ కన్న తల్లిదండ్రులకు అపఖ్యాతి తీసుకురావద్దు.




19. అమ్మకు రెండబ్బకు రెం
డిమ్మహిం డిట్టంచు కూతురెందుకు ధర నా
ద్రిమ్మరి పుట్టకపోయిన
నిమ్మళమని యండ్రు జనులు నిజము కుమారీ!

ఓ కుమారీ! తల్లిదండ్రులను రెండేసిమారులు తిట్టించు కూతురెందులకు? అపఖ్యాతి తెచ్చు మాతాపితరులను అపహాస్యం పాలు జేసే కూతురు పుట్టకబోయిననూ సంతోషమేయని ప్రజలనుట సత్యము.




20. తన బావల పిల్లల యెడన్
దన మఱదుల పిల్లలందు దనపిల్లల కం
టెను మక్కువ యుండవలెన్
వనితల కటువైన వన్నె వచ్చున్ కుమారీ!
ఓ కుమారీ! తన బావల, మరుదుల పిల్లలను తమ కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూచుకున్న ఆడదానికి కీర్తి వచ్చుననుటలో సందేహము లేదు.




21. ధనహీనుడైన గడు దు
ర్జనుండైనన్ గురూపియైన జారుండైనన్
విను పాపియైన నెప్పుడు
దన పతియే తనకు దైవతంబు కుమారీ !
ఓ కుమారీ! భర్త భాగ్యవంతుడు కానివాడైనూ (పేదవాడైననూ) మిక్కిలి చెడ్డవాడైననూ (దుర్మార్గుడైననూ (కురూపి) వ్యభిచారుడైననూ, పాపిష్టుడైననూ, తన మగడే తనకు దేవుడను తెలుసుకొమ్ము.




22. ధనవంతుడైన యప్పుడు
పెనిమిటి చిత్తం బెఱింగి పెండ్లాము మెలం
గును లేమి మెలంగ నేర్చిన
వనితకు లోకమున వన్నె వచ్చు కుమారీ !
ఓ కుమారీ ! భర్త భాగ్యవంతుడైనపుడు యాతని మనస్సు నెరింగి నడుచుకోవలెను. ఒక వేళ భాగ్యహీనుడైనచో (డబ్బులేనివాడు ) ఆతని చిత్తము నెరింగి నడుచుకొన్న స్త్రీ ఇహపరలోకములలో కీర్తి గడించును.




23. కడుపారన్ గూడు గూరలు
దొడవులు వస్త్రములు మిగుల దొరకవనుచుం దా
వడితనమునన్ బెనిమిటితో
నెడన్ బాసి చరింపన్ గూడ దెపుడు కుమారీ !

ఓ కుమారీ! మగని వద్ద దన కోరికలు దీరవని, ఆతని వద్ద పంచభక్ష్య పరమాన్నములతో కడుపు నిండదని,కావలసిన రంగురంగుల వస్త్రములు లభింపవని గూడు దొరకదని అనుకొని తొందరపడి యాతనిని వదలివేసి జీవించుట మగువకు మర్యాద కాదు. సమాజములో చిన్న చూపుతో చూడబడతారు.




24. తలిడండ్రులన్న దమ్ములు
తుల దూగంగ నిమ్ము పసిడి తోనైనను వా
రల యింట సతత ముండుట
వెలదికి మర్యాద గాదు వినవె కుమారీ !
ఓ కుమారీ! తల్లిదండ్రులు, అన్నదమ్ములుగాని ఎంతటి భాగ్యవంతులైననూ వారి ఇంటా ఎల్లప్పుడు ఉండుటా ఆడువారికి మర్యాద గాదు.

25. పిల్లల గనుగొనన్ దలచిన
యిల్లాలు గతాగతంబు లెఱుంగక ఱాగైన్
యల్లరిన్ బెట్టినన్ జెడున్ దా
నుల్లసముల బడును, గీడు నొందున్ గుమారీ !

ఓ కుమారీ ! బిడ్డలను కనవలెననే యాడుది, మంచి చెడ్డల దెలుసుకొనక, మర్యాద దప్పి అల్లరి బెట్టినచో దానే జెడిపోవును అవమానముల పాలై కష్టాములు పొందును.




26. పతి కత్తకు మామకు స
మ్మతిగాని ప్రయోజనంబు మానగవలయున్
హిత మాచరింపవలయును
బ్రతుకున కొక వంక లేక పరంగు గుమారీ !
ఓ కుమారీ ! భర్తకు,అత్తమామలకు ఇష్టాములేని పనిని చేయకుము. వారికిష్టమైన మంచి పనులు చేసి మెప్పుబడయవలెను. నీజీవితంలో మచ్చలేకుండా మసలుకొనుము.




27. పోకిళ్ళు పోక పొందిక
నాకులలో బిందెరీతి నడఁకువగా నెం
తో కలసిమెలసి యుండిన
లోకములోపలను దా వెలుంగుఁ గుమారీ !
ఓ కుమారీ ! వ్యర్ధ ప్రసంగములకు పోవద్దు.అతిగా వాగకూడదు. ఆకుల మధ్యనుండే పిందెవలె ఒదిగియుండి వినయముతో కలసి మెలసి నడుచుకొనవలెను. అప్పుడే ఆ స్త్రీకి సమాజములో పేరు ప్రఖ్యాతులు, గౌరవమర్యాదలు లభిస్తాయి.




28. అత్తపయిన్ మఱదలిపయి
నెత్తిన కోపమున బిడ్డ నేడ్పించుటకై
మొత్తినఁ దనకే కీడగుఁ
జిత్తములో దీనిఁజింత సేయు కుమారీ !
ఓ కుమారీ ! అత్త, మరదళ్ళపై వచ్చిన కోపమును బిడ్డలపై జూపించినచో నష్టపోయేది తానేయని మరువకుము. మనస్సునందొక్కసారి దీనిని గురించి ఆలోచింపుము.




29. మృతియైనను బ్రతుకైనం
బతితోడనె సతికి జెల్లుఁ బతిబాసిన యా
బ్రతుకొక బ్రతుకా? జీవ
స్మృతిగాక వధూటి కెన్న నిదియుఁ గుమారీ!
ఓ కుమారీ! పతివ్రతయైన పడతికి తన పతితోడనే జీవితము తెలుసుకొమ్ము. చావైననూ, బతుకైననూ తన భర్తతోనే భర్త విడిచిన ఆడుదాని బ్రతుకొక బ్రతుకేనా! ఆ బ్రతుకు బ్రతికిననూ చచ్చినదానితో సమానమే.




30. మగని ప్రియ మబ్బె ననుచును
దెగ నీలిగి యింటివారి దిగంద్రొక్కుచు దుం
డగురాలై తిరిగిన సరి
మగువలలో నిదియె తప్పు మాట కుమారీ!
ఓ కుమారీ ! తన భర్త తన మాట జవదాటడని తలంచి గర్వముతో, తన యింటివారిని నీచముగా చూచుట మగువకు తగదు. అటువంటి స్త్రీ తోటి స్త్రీలయందు అవమానములపాలగును.




31. జీవములు భర్తపద రా
జీవములని చిత్తమందుఁ జింతించిన ల
క్ష్మీవల్లభు చరణంబుల
సేవ లతాంగులకు నెమ్మిఁ జేయు గుమారీ!
ఓ కుమారీ! భర్త పాదముల వద్దే తన జీవితమని తలంచిన పతివ్రతలకు తన పాద సేవా భాగ్యములను ఆ విష్ణుమూర్తి ప్రెమతో కలుగజేయును.




32. కడు బుద్ధి గలిగి మెలంగినఁ
బడంతుక పుట్టింటివారు పదివేల వరా
లిడుకంటే గీర్తి యగు ద
మ్మిడి లేకుండినను నేర్చి మెలగు కుమారీ !
ఓ కుమారీ ! మిక్కిలి చాతుర్యముతో మెలగిన ఆడాదానికి పుట్టింటి వారు పదివేల వరాలనిచ్చుటకంటెను మిక్కిలి గొప్పది. కీర్తిగలదగును. ఆడువారు భోగభాగ్యములున్నను, లేకున్నను ఈ సూక్ష్మమునెరింగి నడచుకొనవలెను.

33. కడుఁబెద్దమూటా దెచ్చినఁ
జెడుగై వర్తించు నేనిఁ జిరతర చింతం
బడుదురు తల్లిదండ్రులు తోఁ
బడుచులు సోదరులు నిందఁ బడుచు గుమారీ!
ఓ కుమారీ! అత్తవారింటికి నీవెంత పెద్ద మూటతో వచ్చిననూ దుష్టురాలై ప్రవర్తించినచో నీ తల్లిదండ్రుల, అన్నదమ్ముల నిందా శాపములతో నిరంతరము నశించిపోవుదువు.




34. పుట్టింటి వారి నీచతఁ
బెట్టకు మత్తింటివారు పెట్టెడి బాధల్
పుట్టింట దెలియనీయకు
రట్టడి చెలియందు రదియె రవ్వ కుమారీ!
ఓ కుమారీ! పుట్టింటి వారిని నీచముగా జూడకు. అత్తింటి కష్టమును పుట్టింట వెల్లడించరాదు. ఈ విధమైన అల్లరి చేయుట వల్ల అలుసైపోవుదువు.




35. తనకెంత మేలు చేసిన
మనమున కింపైన పనులుఁ మసలిన దాసీ
వనితల కెన్నటికైనం
జనవిచ్చి మెలంగరాదు జగతి గుమారీ!
ఓ కుమారీ! నీ యింటి పనివారు నీకెంత మేలు చేసిననూ, నీ మెప్పు పొందాలని నీకెంత ఇష్టమైన పనులు చేసి పెట్టిననూ వారితో ఒకింత జాగరూకరరో మెలుగుము. వారితో అత్యంత స్నేహముజేసి అమితముగా మోసపోవద్దు.

36. కులదేవతలకు బెట్టిన
పొలుపునం దన యింటియాఁడు బొట్టెల కెల్లం
గలమాత్ర మొసంగకుండిన
గలఁత పొడము దాన మేలు గాదు కుమారీ!
ఓ కుమారీ! ప్రేమతో నీ ఇష్టదేవతలకు బెట్టినట్లు దన ఇంటి ఆడపడుచులకు ఉన్నంతలో బెట్టక పోయినచో, కలహము వచ్చి, వారి శాపానుగ్రహములకు పాత్రురాలవుతావు. వారిని నీ కులదేవతలవలె నెరుంగుము.

37. బద్దకము సంజనిద్దుర
వద్దు సుమీ దద్దిరంబు వచ్చును దానన్
గద్దింతురింటివారలు
మొద్దందురు తోడివారు ముద్దు కుమారీ!
ఓ యవ్వనవతీ! బద్ధకముతో సాయంకాలము నిద్రించినచో మొద్దువని నిందింతురు. ఇంటివారు తూలనాడేదరు

38. ఇంటఁ గల గుట్టు నీ పొరు
గింట రవంతైనం దెలుప నేఁగకు దానం
గంటనపడి నీవారలు
గెంటించెద రిల్లు వెడలఁ గినుక గుమారీ!
ఓ కుమారీ! నీ ఇంటి రహస్యములను పొరుగింటికి తెల్పినచో పలు అనర్ధములు వచ్చును. సొంతవారే ఏవగించుకొంటారు. విరోధములు వస్తాయి. కోపముతో నీవారే నిన్ను ఇంటినుండి వెడలగొట్టెదరు. కావున గుట్టును రట్టు చేయకుము.

39. వేకువజామున మేల్కని
పైకి వెడలి వచ్చి ప్రాచి పని దీర్పవలెన్
లేకున్నం దెల్లవాఱిన
లోకులు నవ్వుదురు సభల లోనం గుమారీ!
ఓ కుమరీ! తెల్లవాఱుజాముననే ఇంటి ముంగిట పాచి పనులు చేయుట మంచిది. బారెడు పొద్దెక్కిన తర్వాత నలుగురి ఎదుట పాచిపని చేసినచో నవ్వులపాలవుతావు.

40. ఇక్కడి దక్కడం నక్కడి
దిక్కడ జెప్పినను వారి కిద్దఱికిఁ బగల్
పొక్కినఁ గల చేడియ ల
మ్మక్కా! యిడుముళ్ళమారి యండ్రు కుమార
ఓ కుమారీ! అక్కడ మాటలిక్కడ, ఇక్కడ మాటలక్కడ చెప్పి నలుగురిలో నవ్వులపాలుగాకు. కలహాలరిమారియని నిన్నాడిపోసుకుంటారు.

41. తలవాకిట నెల్లప్పుడు
నిలువఁగ రా దెప్పు డెంత నిద్దురయైనన్
మెలఁకువ విడరాదు సుమీ
తల నడచుచు విప్పికొనుట తగదు కుమారీ!
ఓ కుమారీ! ఇంటి ముంగింట్లో అలంకరిచుకుని నిలబడరాదు. మొద్దు నిద్ర పనికి రాదు. నిద్రలో కూడా కొంచెం మగతగా మెలకువ కలిగి యుండవలెను. నడుస్తున్నప్పుడు(జుట్టుముడి) తల వెంట్రుకలు విప్పరాదు. (నిత్యము తల విప్పుకొని ఉండరాదని భావము)




42. వారికి వీరికి గలిగెను
గోరిన వస్తువులు మాకుఁ గొదవాయె నటం
చూరక గుటకలు మ్రింగుట
నేరముగాఁ దలఁవలయు నెలఁత కుమారీ!
ఓ సుకుమారీ! వారికి వీరికి ఉందని, తనకు లేదని చింత పడరాదు. ఇరుగుపొరుగువారి యొక్క భాగ్యమును జూసి ఈర్ష్యపడరాదు. సంతృప్తినలవర్చుకొనవలెను. తనకున్న దానితో తృప్తి పడుట మిక్కిలి యుత్తమము. కోరికలతో చింతపడుట మిక్కిలి తప్పు.

43.కొన్నాళ్ళు సుఖము కష్టము
కొన్నాళ్ళు భుజింపకున్న గొఱగాదు సుమీ
పున్నమ దినముల వెన్నెల
యెన్నంగ సమాసలందు నిరులు కుమారీ!
ఓ కుమారీ! కష్టసుఖాలను, రెండింటినీ అనుభవిస్తేనే జీవితం విలువ తెలియును.పున్నమినాడు వెన్నెలయు, అమావాస్యనాడు చీకటి ఉండుట సహజము కదా!

44. పొంతఁ బని సేయ కెన్నఁడు
పంతంబులు పలుకఁబోకు ప్రాజ్ముఖముగ నీ
దంతంబులు దోమకు మే
కాంతంబులు బయలుపఱుప కమ్మ! కుమారీ!

ఓ కుమారీ! ఎవ్వరితోను కలిసి మెలసి పని చేయక,ఊరికెనే పరుషమైన మాటలు మాట్లాడరాదు. తూర్పు దిశగా పండ్లు తోముకోవద్దు. రహస్యాలు వెల్లడించవద్దు.

45. నడకలలో నడుగుల చ
ప్పుడు వినబడకుండవలయును భువి గుంటలు క
కంపడరాదు మడమ నొక్కులఁ
బడఁతుల మర్యాద లెఱిఁగి బ్రతుకు కుమారీ!
ఓ కుమారీ! నీ అడుగుల చప్పుడు వినబడకుండునట్లు నడువవలెను. నీ కాలి మడమలు గుర్తులు పడకుండ నడవవలెను. స్త్రీల సద్గుణములు తెలుసుకొని జీవింపుమమ్మా!

46. నవంగ రాదు పలుమఱు
నవ్వినఁ జిఱునవ్వుగాని నగరా దెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వునఁ గానంగఁ బడెడి జాడ గుమారీ!
ఓ చినదానా! ఇంటి ఇల్లాలు అనవసరంగా ఇకిలించరాదు(నవ్వరాదు). చిరునవ్వు చింతలను బారద్రోలును. పండ్లు కనబడునట్లు పకపకా నవ్వరాదు. నవ్వు నాలుగు విధాలా చేటుయని మరువకుము.

47. తొడవులు మిక్కిలి గలిగినఁ
గడుఁ ప్రేమన్ మగఁడు మిగుల గారా మిడినన్
పడఁతుక పసుపుం గుంకుమ
గడియైనన్ విడువ రాదు గాదె కుమారీ!
ఓ కుమారీ! ఎంత భాగ్యవంతురాలివైనను, మగడెంత బ్రీతితో నిన్ను జూచుకున్నచో ఆడది పసుపు కుంకుమలను నిమిషమైనను వీడరాదు సుమా!

48. చెదుఁగులతో లంజెలతో
గుడిసేటులతోడు బొత్తు కూడదు మది నె
ప్పుడు మ్నిల నుత్తమ కాంతల
యడుగులకు న్మడుగులొత్తు మమ్మ కుమారీ!
ఓ సౌభాగ్యవతీ! చెడ్డవాతి(పోకిరి స్త్రీలు) స్నేహమును చేయరాదు.సౌశీలురు, మంచివారునైన స్త్రీలకు సేవ చేయుట వలన నీకు మంచి జరుగును.

49. విసువకు పని తగిలిన యెడఁ
గసరకు సేవకుల మిగులఁ గాంతునితోడన్
రొసరొస పూనకు మాడకు
మసత్యవచనంబు లెన్నఁడైన గుమారీ!
ఓ చినదానా! మిక్కిలిగా పని ఒత్తిడి కలదని విసుగు చెందరాదు. పనివాండ్రను నెక్కువగా కసరుకొనరాదు. భర్తను ఈసడించరాదు. అసత్యం చెప్పరాదు.

50. వేళాకోళంబులు గ
య్యాళితనంబులును జగడ మాడుతలును గం
గాళీపోకలుఁ గొందెము
లాలోచించుటయుఁ గూడదమ్మ కుమారీ!
ఓ కుమారీ! అనవసరపు వేళాకోళములు, గయ్యాళితనములు,కొట్లాటలు, చిన్న పెద్ద తారతమ్యము అరయక మాట్లాడుటలు, ఫిర్యాదులు చేయుటయు తప్పుయని తెలుసుకొనుమమ్మా!

కుమార శతకము

1. శ్రీ భామినీ మనొహరు
సౌభాగ్య తయా స్వభావు సారసనాభున్
లోఁ భావించెద; నీకున్
వైభవము లొసగుచుండ, వసుధఁ గుమారా
ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.

2. పెద్దలు వద్దని చెప్పిన
పద్దుల బోవంగరాదు పరకాంతల నే
పొద్దే నెద బరికించుట
కుపదేశింపగఁ గూడ దుర్విఁ గుమారా!
ఓ కుమారా! పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు. ఇతర స్త్రీలను ఎన్నడునూ మనసులో తలంచుట మంచిది కాదు. ఈ విషయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము.

3. అతి బాల్యములో నైనను
బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స
ద్గతి మీర మెలగ నేర్పిన
నతనికి లోకమున సౌఖ్యమగును గుమారా!
ఓ కుమారా! మిక్కిలి చిన్నతనములో కూడా చెడు మార్గములయందు నడువరాదు. మంచిమార్గములో నడచిన వానికి లోకమందు సుఖమే ప్రాప్తించును.

4. తనపై దయ నుల్కొనఁ గన్
గొన నేతెంచినను శీల గురుమతులను వమ్
దనముగఁ భజింపందగు
మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!
ఓ కుమారా! దయతో తనకు మంచి చేయ బూనిన వారిని గౌరవించి, నమస్కరింపుము. వారి మనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద. పెద్దలనుసరించే మంచి పద్ధతి యిదియే.




5. ఉన్నను లేకున్నను పై
కెన్నడుమర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్న తల్లిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిందిరుగు మెలమిఁ గుమారా!

ఓ కుమారా! నీకు ఉన్నా లేకపోయినా నీ కుటుంబ రహస్యాలను ఇతరులకు తెలియనీయకుము. నిన్ను కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చునట్లు. నలుగురు గొప్పగా పొగిడే విధంగా సంతోషముతో మసలుకొనుము.

6. పెద్దలు విచ్చేసినచొ
బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్
హద్దెరిగి లేవకున్నన్
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
ఓ కుమారా! మన ఇంటికి పెద్దలు వచ్చినచో మర్యాదగా లేచి నిలబడవలెను. బద్ధకమువలనగాని, పొగరుతనంతోగాని, పెద్ద చిన్న భేదములు గ్రహింపక మొండిగా లేవకున్నచో, నిన్నందరూ మూర్ఖునిగా పరిగణిస్తారు.

7. పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను;
కాని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!
ఓ కుమారా! నీకెంత తీరికలేకున్ననూ, ఎన్ని పనులున్ననూ, మంచి బుద్ధిగలవాడివై ప్రతీ రోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలెను. నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి, నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.




8. కల్లలగు మాట లాడకు
మెల్లజనంబులకు వేగ హృదయము కడు రం
జిల్లగఁ బల్కుము నీ కది
తెల్లము రహి గీర్తిఁగాంచు దెరగు కుమారాఁ!
ఓ కుమారా ! అసత్యములాడరాదు. మనుషులందరూ మెచ్చుకొనేటట్లు వారి మనస్సులు సంతోషపడునట్లు మాట్లాడుము. మహిలో నీకది ఆనందమును కీర్తిని ప్రసాదించును.

9. ఏనాడైనను వినయము
మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ
బూనకు మసమ్మతయు బహు
మానమునను బొందు మిదియె మతము కుమారా!
ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మనస్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.

10. తనకు విద్యాభ్యాసం
బును జేసినవానికన్న బొలుపుగఁ బదిరె
ట్లను దూగు దండ్రి వానికి
జననియుఁ బదిరెట్లుఁ దూగు జగతిఁ గుమారా!
ఓ కుమారా! ఈ లోకమందు విద్యాభ్యాసము నేర్పి తీర్చిదిద్దిన గురువు కంటే కన్నతండ్రి పదిరెట్లు ఎక్కువ. కన్నతండ్రి కంటే కన్నతల్లి పదిరెట్లు ఎక్కువ. ఈ సత్యమును తెలుసుకొని మసలుకొనుము

11. తమ్ములు తమయన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁ కుమారా!
ఓ కుమారా! పిన్నవారు పెద్దవారిపట్ల భయభక్తులను కలిగి యుండాలి. తమ్ముళ్ళూ అన్నపట్ల గౌరవమర్యాదలను ప్రదర్శించాలి. అన్నకూడా తమ్ముళ్ళను అదే భావముతో చూడాలి. ఇటువంటి అన్నదమ్ములు, లోకమున పేరు ప్రఖ్యాతులు పొందగలరు.




12. తనయుడు చెడుగై యుండిన
జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
ఓ కుమారా! కొడుకు చెడ్డవాడైన తండ్రి తప్ప. ఇది అందరకు తెలిసినదే. గావున ఈ సత్యమును గుర్తెరింగి నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకుండునట్లు నడుచుకొనుము

13. మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు ;
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!
ఓ కుమారా! నీ రహస్యములెన్నడును ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.

14. తల్లిని దండ్రిని సహజల
నల్లరి బెట్టినను వారలలుగుచు నీపై
నుల్ల మున రోయు చుందురు
కల్లరి వీడనుచుఁ గీర్తిఁ గందం గుమారా!
ఓ కుమారా! కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్టరాదు. అట్లు చేసినచో వారు నీపై కోపించి నిన్ను అబద్ధములాడువానిగా చిత్రించి మనస్సునందు కోపపడుదురు. దానివలన నీకు అపకీర్తి వచ్చును. కావున అట్లు చేయరాదు.

15. అపం దన తల్లిగ మే
లొప్పంగని జరుపవలయు నుర్వీస్థలి జి
న్నప్పుడు చన్నిడి మనిసిన
యప్పడతియు మాతృతుల్యయండ్రు కుమారా!
ఓ కుమారా! తన అక్కను తల్లివలె భావించాలి. అమ్మ తరువాత అక్కయ్యే మనకు తల్లి.కావున అక్కను తల్లిగా పూజించాలి. ఆమె మనసును బాధింపకు. ఆమె దీవెనలే మనకు సోపానమార్గాలు. అట్లే తనను ఎత్తుకొని పోషించినవారిని (దాదితో సహా) కూడా తల్లితో సమానంగా గౌరవించాలి.




16. ఆకులత బడకు మాపద
నేకతమునఁ జనకు త్రోవ నింతికి దగు నం
తేకాని చన వొసంగకు
లోకులు నిన్నెన్న సుగుణలోల! కుమారా!
సుగుణాశక్తి గల కుమారా! ఆపదసమయమందు ఆందోళన పడరాదు. తోడులేనిదే ఒంటరిగా పోరాదు. భార్యకు తగినంత చనువును మాత్రమే ఇయ్యవలయును. ఎక్కువ ఇచ్చినచో నిన్ను తక్కువ చేయును . ఈ విషయములన్నింటిని తెలిసికొని మసలుము.

17. తనుజులనుం గురు వృద్ధుల
జననీ జనకులను సాధుజనుల నెవడు దా
ఘను డయ్యు బ్రోవడో యా
జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!
ఓ కుమారా! మనిషి తానెంత గొప్పవాడైనను తన ఆలుబిడ్డలను, తల్లితండ్రులను, గురువులను, పెద్ద్దలను, మంచివారిని ఆదరించాలి. అట్లు చేయనివాడు బ్రతికి యుండినను చనిపోయిన వానితో సమానము.




18. దుర్జనుల నైనఁ దిట్టకు
వర్జింపకు సుజన గోష్టి; పరులను నెల్లన్
నిర్జింతుననుచుఁ ద్రుళ్ళకు;
దుర్జనుడండ్రు నిను నింద దోప కుమారా!
ఓ కుమారా! చెడ్డవారిని కూడా దూషింపరాదు. మంచివారున్న చోటును వదలరాదు. మంచివారున్న చోటును వదలరాదు. శత్రువులను చంపుతానని విర్రవీగరాదు. అట్లు చేసినచో నిన్ను చెడ్డవాడని అంటారు. నిందలు వేస్తారు. నీకు చెడ్డ పేరు వస్తుంది.

19. సంపద గల వారిని మో
దింపుచు జుట్టుకొని యందు రెల్లప్పుడు న
త్సంపద తొలంగిన నుపే
క్షింపుడు రవివేక జనులు క్శితిని కుమారా!
ఓ కుమారా! లోకమందు ధనమే నిత్యమని తెలివి లేనివారు భావిస్తారు. డబ్బున్నవారినే ఆశ్రయించి తమ పబ్బము గడుపుకొంటారు.సంపదలు పోయిన వెంటనే మరల వారినే దూషిస్తారు. ఎంత అవివేకులు ఈ జనులు.




20. సద్గోష్ఠి సిరియు నొసగును
సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
సద్గోష్ఠియె యొనగూర్చును
సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!
ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలయందే మంచి జ్ఞానమును సంపదింతురు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.




21. ధనవంతు లైన బహు స
జ్జనులైనను నీకు మిగుల సమ్మతులై యు
న్నను సతి జనకుని గృహమం
దున నుండుట తగదు కీర్తి తొలగు కుమారా!
ఓ కుమారా! అత్తవారెంత అధికులైననూ, సంపన్నులైనను, సజ్జనులైననూ, నీ పట్ల మిక్కిలి మక్కువ జూపుతున్నను, భార్యను పుట్టినింట యుంచుట మంచిది కాదు. అట్లు చేసినచో కీర్తి నశించును.




22. సభలోపల నవ్విన యెడ
సభవా ర్నిరసింతు రెట్టి జనుని న్నెరి నీ
కభయం బొసంగె నేనియు
బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!
ఓ కుమారా! సభలలొ నవ్వరాదు. సభలో నవ్విన వారెంతటివారైననూ వారిని చిన్నచూపు చూచెదరు. నీ తెలివిని మెచ్చుకొని నిన్ను రక్షించిన రాజుదయను నమ్ముకొని గర్వపడరాదు.

23. పెరవారలుండ ఫలముల
నరయంగా వారికిడక యాతడె మెసవన్
సరిగాదు విసపు మేతకు
సరియౌనని తలపు మానసమున కుమారా!

ఓ కుమారా! ఇతరులు ఉన్న సమయములో ఒక్కడవే పండ్లు ఫలములు తినరాదు. వారికి పెట్టకుండా తినుట మంచి పద్ధతి కాదు. నీ ఎదుట ఉన్నవారికి పెట్టకుండా తినుట వలన నీవు తిన్నది విషముతో సమానముగునని తలంచుము.

24. మును స్నానము సేయక చం
దన మలదుట యనుచితం;
బుదకయుంత వస్త్రం
బును విదలించుట కూడదు
మనమున నివి తెలిసి మనుము మహిని కుమారా!
ఓ కుమారా! ముందుగా స్నానం చేసిన పిదప శరీరమునకు గంధమును పూసుకోవాలి. స్నానము చేయకుండ గంధము పూసుకొనుట మంచిది కాదు. నీళ్ళతో కూడిన బట్టను విదిల్చుట కూడ తగని పని. దానివలన దరిద్రము అంటుకొనును. ఈ విషయములను మనస్సుఅన్ందుంచుకొని ప్రవర్తించవలెను.




25. అవయవ హీనుని సౌంద
ర్యవిహీను, దరిద్రు, విద్యరాని యతని సం
స్తవనీయు, దేవు, శ్రుతులన్
భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!
ఓ కుమారా! వికలాంగులను, అందములేనివారిని, దరిద్రులను, విద్యలేనివారిని, గౌరవనీయులను, భగవంతుని, వేదములను, పండితులను, నిందింపరాదని విజ్ఞానులు చెప్పుచున్నారు. ఈ పనులను జేయరాదని అనుచున్నారు.




26. గరళము పెట్టెడు వాని
న్బరు జంప దలంచువాని బనులెల్ల బయ
ల్పరచెడివానించ్ బరధన
హరుని నృపతి చంపి పుణ్యుడగును కుమారా!
ఓ కుమారా! విషము పెట్టి చంపువారిని, ఇతరులు చంపజూతురు. హంతకులను, రహస్యముల బయటపెట్టేవారిని, దొంగలను, రాజు నిర్దయతో చంపవలెను. అట్లు చేయుటవలన రాజునకు పుణ్యగతి ప్రాప్తిల్లును. పేరు ప్రఖ్యాతులు వృద్ధి పొందును.

27. సత్తువగల యాతడు పై
నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్
విత్తము గోల్పడు నతడును
జిత్తని పీడితుండు జింతజెందు కుమారా!
ఓ కుమారా! శక్తియున్న బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకున్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును. శక్తి లెక పీడింపబడతాడు. మనస్సు విచారముతో , నిత్యము బాధలఓ నుండును.

28. ఓరిమియె కలిగి యుండిన
వారలగని ప్రజ్ఞలేనివారని యెదం
నారయ సత్పురుషాళికి
నోరిమియే భూషణంబు రోరి కుమారా!

ఓ కుమారా! మనిషికి ఓర్పు ప్రధానము. సహనము కలవారిని జూచి తెలివిలేనివారిగా జమకడతారు. కాని నిజానికి మనిషికి ఓర్పే భూషణము. ఓర్పువలన కార్యము సాధింపవచ్చును.

29. ఎటువంటి వర కులంబున
బటు తరముగ బుట్టెనేని పరగగ మును గ
న్నటువంటి కర్మఫలముల
కట కట భోగింప వలయు గాదె కుమారా!
ఓ కుమారా! ఎంతటి గొప్పవంశము పుట్టినను , మనిషి పూర్వజన్మలందు తను జేసిన కర్మఫలంబులను అనుభవింపక తప్పదు కదా! కావున ఈ సత్యము నెఱింగి మసలు కొనుము.




30. పెక్కు జనులు నిద్రింపగ
నొక్కెం డయ్యెడను నిద్ర నొందక యున్నన్
గ్రక్కున నుపద్రవంబగు
నక్కర్మమునందు జొరకుమయ్య కుమారా!
ఓ కుమారా! ఎక్కువమంది నిద్రించుచున్న ప్రదేశమందు తానొక్కడునూ మేలుకొని యుండరాదు. అట్లు మెలకువగా యున్నచో కష్టములు కలుగును. ఒకవేళ నిద్ర రానట్లయిన, నిద్ర నటించుము.




31. ధనవంతుడె కులవంతుడు
ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
ఘనవంతుడు బలవంతుడు
ధనవంతుడె ధీరుఢనుచు దలతె? కుమారా!
ఓ కుమారా! ఈ లోకమందు ధనవంతుని అందరూ మంచివానిని గౌరవింతురు. ధనము కలవానిని లోకులు సుందరాంగుడని, గుణవంతుడని, గొప్పవాడని, బలవంతుడని, ధైర్యవంతుడని పలువిధములుగా పొగడుదురు. మనసునందీ విషయాన్నుంచుకొని ధనమును సంపాదింపుము.

32. విను ప్రాణ రక్షణమునన్
ధనమంతయు మునిగిపోవు తై, పరిణయమం
దున, గురుకార్యమున, వధూ
జన సంగమమునందు బొంక జనును కుమారా!
ఓ కుమారా! వినుము ప్రాణము కాపాడుకొను సమయమందుననూ, ఐశ్వర్యము నశించు సమయమందునను, వివాహ సమయములందుననూ, గొప్ప ప్రజోపకార్యము నెరవేర్చు సమయమందునను, స్త్రీలను సంగమించు సమయమందునను అసత్యము లాడవచ్చును.




33. దీనుండై నను శాత్రవు
డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత న
మ్మానవుని కోర్కె దీర్చిన
వాని సుజనుడాండ్రుబుధులు వసుధ కుమారా!
ఓ కుమారా! దీనుండై శరణు గోరి వచ్చినవాడు శత్రువైననూ, ఆతని ప్రయోజనమును ప్రేమతో నెరవేర్చినచో అతనిని జూచి పండితులు సుజనుడని పొగడుదురు.




34. మిత్రుండు దనకు విశ్వా
మిత్రము జేసినను గాని మేలనవచ్చును
శాత్రవుడు ముద్దగొన్నను
ధాత్రిం దన కదియె కీడు తలప కుమారా!

ఓ కుమారా! లోకమందు మిత్రుడు మనకు కీడు చేసిననూ, దానిని మేలు చేసినట్లుగానే భావింపవలెను. కాని శత్రువు మనయింట భోజనము చేసిననూ మనకు (కీడు) అపకారమే కలుగునని తెలియవలెను.




35. విత్తంబు విద్య కులము
న్న్మత్తులకు మదంబొసంగు; మాన్యులకున్ స
ద్వృత్తి నొసంగున్ వీనిన్
జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా!
ఓ కుమారా! ధనము, గొప్ప విజ్ఞానము, సద్వంశము, దుర్మార్గులకు గర్వమును ఇచ్చును. ఈ త్రిగుణములే సజ్జనులకు మంచిని కలుగ జేయును. వీనిని గుర్తుంచుకొని ప్రవర్తించుము.




36. ఋణ మధిక మొనర్చి సమ
ర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకు ల
క్షణశాలి రాణి దుశ్చా
రిణి యగు జననియును దల్ప రిపులు కుమారా!
ఓ కుమారా! కుమారులకు అప్పులను ఆస్థులుగా ఇచ్చిన తండ్రి, విద్యలేని కుమారుడు, అందమైన భార్య, చెడునడాత గల్గిన తల్లి ఆలోచించినచొ వీరందరూ శత్రువులే సుమా!




37. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
బ్రాజ్ఞతను గలిగి యున్నన్
బ్రాజ్ఞులలొఁ బ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా!

ఓ కుమారా! నిన్ను చేయమని ఆజ్ఞాపించిన పనులను తెలివిగా చేసి మెప్పు పొందుము. ఒక్క బుద్ధి నైపుణ్యమును ప్రదర్శించుటయే గాదు. తెలివైన వారిలో తెలివైన వానిగా పేరు తెచ్చుకొని అభివృద్ధి చెందుము.




38. వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁ బూత చరితుండున్
సద్ధర్మశాలియని బుధు
లిద్దరఁ బొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!

ఓ కుమారా! పెద్దపట్ల గౌరవము ప్రదర్శించుము. పెద్దలను గౌరవించినచొ వారి దివ్యమైన ఆశీస్సులు పొందుటయే గాక బుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, మంచివాడని మెచ్చుకుంటూ ప్రేమతో పొగడుదురు.




39. సతతముఁ బ్రాతః కాలో
చితవిధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
పతి పూర్వ పర్వతాగ్రా
గతుడగుటకు మున్నె వెరవు గల్గి కుమారా!
ఓ కుమారా! ప్రతిరోజు సూర్యోదయాత్పూర్వమే మేల్కొనుము. ఉదయమందు చేయవలసిన పనులను తెలుసుకొని ఆ పనులను సూర్యుడు ఉదయించకముందే శ్రద్ధతో చేయుము.




40. పోషకుని మతముఁ గనుం గొని
భూషింపక గాని ముదము బొందరు మఱియున్
దోషముల నెంచు చుండును
దోషివయిన మిగులఁ గీడు దోచుఁ గుమారా!



41. నరవరుడు నమ్మి తను నౌ
కరిలో నుంచునెడ వాని కార్యములందున్
సరిగా మెలంగ నేర్చిన
పురుషుడు లోకమునఁ గీర్తిఁ బొందుఁ గుమారా!
ఓ కుమారా! యజమాని నిన్ను నమ్మి ఒక పనిని అప్పగించినపుడు, ఆ పనులను శ్రద్ధతో చక్కగా చేయుము. అట్లు చేసినచో నీకు లోకమునందు మిక్కిలి కీర్తి సిద్ధించును.

42. ధరణి నాయకు రాణియు
గురు రాణియు నన్న రాణి కులకాంతను గ
న్న రమణి దనుగన్నదియును
ధరనేవురు తల్లులనుచుఁ దలుపు కుమారా!
ఓ కుమారా! భూమియందు ప్రతి ఒక్కరికినీ అయిదుగురు తల్లులుందురు. కన్నతల్లి, యజమాని భార్య,గురుపత్ని, అన్నభార్య(వదిన) భార్య తల్లి (అత్త). ఈ ఐదుగురు గూడా తల్లులనియే భావింపుము.




43. ఆచార్యున కెదిరింపకు
బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
లోచనము లొందఁ జేయకు
మాచారము విడవఁ బోకుమయ్య ! కుమారా!

ఓ కుమారా! గురువును ధిక్కరించకు, నిన్ను పోషించు యజమానిని నిందింపరాదు. చెయుపనియందు శ్రద్ధ వహింపుము. పెద్దలు నడచిన పద్ధతిని విడువరాదు.




44. నగం గూడదు పరసతిఁ గని
తన మాతృ సమనమెన్నదగు; నెవ్వరితోన్ఁ
బగ గూడ, దొరల నిందిం
పగఁగూడదు, గనుము వృద్ధ పధము కుమారా!
ఓ కుమారా! ఇతరుల భార్యలను చూసి నవ్వరాదు. వారిని కన్నతల్లితో సమానముగా జూడవలయును. ఎవ్వరితోను విరోధము పెట్టుకొనరాదు. ఇతరులను దూషింపరాదు. పెద్దలు ఈ పద్ధతినే అనుసరించిరని తెలియుము.

45. చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
జేయకుము రిపు గృహంబున
గూయకు మొరుమనసు నొచ్చుకూత కుమారా!
ఓ కుమారా! చేయకూడని చెడ్డపనులను చేయకుము. శుభకార్యములను విడువరాదు. శతృ గృహములయందు భోజనము చేయరాదు. ఇతరులమనస్సులను బాధించు మాటలు మాట్లడరాదు.

ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.

46. పిన్నల పెద్దల యెడఁ గడు
మన్ననచే మలగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగుచుండిన
నన్ని యెడల నెన్న బడదువన్న కుమారా!
ఓ కుమారా! పిన్నపెద్దల పట్ల కడు గౌరవముతో మెలగుము. నీవు మంచిపద్ధతుల యెన్నుకొని ప్రవర్తించినట్లయితే అన్నింటా నీకు శుభమే కలిగి మంచి పేరు ప్రఖ్యాతులను బడయగలవు.

47. బూటకపు వర్తనము గని
జూటరి వీడనుచుఁ దప్పఁ జూతురుగా! యా
బాటను విడి సత్యము మది
బాటించి నటించు వాడె నరుడు కుమారా!
ఓ కుమారా! అసత్యమైన బూటకపు నడవడికను మానుకొనుము. దానివలన నీవు అబద్ధములాడువాడని నిన్ను తప్పుగా చూస్తారు. ఆ చెడుమార్గమును వీడి సత్యమును బాటించి మనిషిగా మసలుకొనుము. నీవు సత్యమార్గమున ప్రయాణించినచో నిన్ను లోకులు సత్యవర్తనుడని పొగడుతారు.




48. లోకులు తనుఁ గొనియాడ వి
వేకి యదియు నిందగాక విననొల్లడు సు
శ్లోకుల చరితం బిట్టిది
చేకొనవలె నట్టి నడక చిన్ని కుమారా!

ఓ కుమారా! పండితులు పొగడ్తలకు పొంగిపోరు. ప్రజలు నిందించినపుడెట్లు మనము విననట్లుందుమో పొగడునప్పుడు తెలివికలవాడు పొగడ్తలను వినరు. ఇదియే సుజ్జనుల పద్ధతి. దీనిని గ్రహించి నీవు కూడా మంచి నడత అలవరచుకొనుము.

49. వగవకు గడచిన దానికి
పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
యొగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!
ఓ కుమారా! జరిగిపోయినదానికి విచారించకు. దుర్మార్గులను ఎప్పుడునూ పొగడ రాదు. చేయలేని పనికి చింతింపరాదు. ఈ భూమియందు పనులన్నియు భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగునని తెలుసుకొనుము. తగని పనులను చేయకుము.

50. బరులెవ్వరేని దనతో
బరిభాషించినను మేలు పలుక వలయు నా
దరము గల చోటఁ గీడు
న్గరము నొనర్పంగరాదు గదర కుమారా!
ఓ కుమారా! ఇతరులతో మాట్లాడునపుడు మంచినే పలుకవలయును. నిన్నాదరించిన వారికి కీడు తలపెట్టకు. ఈ సన్మార్గములను తెలుసుకుని నడుచుకొనుము.

గువ్వలచెన్న శతకము

క. శ్రీ పార్థసారధీ! నేఁ బాపాత్ముఁడ నీదు పాలఁ బడినాఁడ ననుం
గాపాడు మనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా!
।। 1 ।।
క. నరజన్మ మెత్తినందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద
చ్చరణములు మఱవకుండిన గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా!
।। 2 ।।
క. ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్
జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా!
।। 3 ।।
క. సారాసారము లెఱుఁగని బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా
నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేల వేము గువ్వలచెన్నా!
।। 4 ।।
క. అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్
వడిఁజేసి నంత మాత్రాన కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా!
।। 5 ।।
క. ఈవియ్యని పద పద్యము గోవా చదివించు కొనఁగఁ గుంభిని మీఁదన్
ఈవిచ్చిన పద పద్యము గోవా మఱిఁ జదువుకొనఁగ గువ్వలచెన్నా!
।। 6 ।।
క. ఇరుగు పొరుగువా రందఱుఁ గర మబ్బుర పడుచు నవ్వఁగా వేషములన్
మఱి మఱి మార్చిన దొరలకు గురువగునా బ్రాహ్మణుండు గువ్వలచెన్నా!
।। 7 ।।
క. అనుభవము లేని విభవము లను భావ్యయ కానీయాలు నార్యాను మతిన్
గనని స్వభావము ధర్మముఁ గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వలచెన్నా!
।। 8 ।।
క. పదుగురికి హితవు సంపత్ప్రదమును శాస్త్రోక్తమైన పద్ధతి నడువన్
జెదరదు సిరి హరిభక్తయుఁ గుదురునుగద మదిని నెన్న గువ్వలచెన్నా! ।। 9 ।।
క. వెలకాంత లెందఱైననుఁ గులకాంతకు సాటిరారు కువలయమందున్
బలువిద్య లెన్ని నేర్చినఁ గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా!
।। 10 ।।
క. కలకొలఁది ధర్మముండినఁ గలిగిన సిరి కదలకుండుఁ గాసారమునన్
గలజలము మడువులేమిని గొలగొల గట్టు తెగిపోదె? గువ్వలచెన్నా!
।। 11 ।।
క. తెలిసియుఁ దెలియనివానికిఁ దెలుపంగలఁడే? మహోపదేశికుడైనన్
బలుకంబాఱనిగాయము గొలుపంగలఁడెవడు మడ? గువ్వలచెన్నా!
।। 12 ।।
క. చెలియలి భాగ్యము రాజ్యంబుల నేలుచు జనుల ద్వేషమునఁ జూచుచుఁ గ
న్నుల మత్తతఁ గొన్నాతఁడు కొలనికి గాపున్న వాఁడు గువ్వలచెన్నా!
।। 13 ।।
క. అపరిమిత వాహనాదిక మపూర్వముగనున్న యల్పుఁడధికుండగునా?
విపులాంబరవాద్యంబులఁ గుపతియగునె గంగిరెద్దు? గువ్వలచెన్నా!
।। 14 ।।
క. పందిరి మందిరమగునా? వందిజనంబాప్తమిత్రవర్గం బగునా?
తుందిలుఁడు సుఖముఁగనునా? గొంది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా!
।। 15 ।।
క. మిత్రుని విపత్తునందుఁ గళత్రమును దరిద్రదశను భ్రాతలగుణమున్
బాత్రాది విభక్తంబున గోత్రను గనుగొనఁగవలయు గువ్వలచెన్నా!
।। 16 ।।
క. అంగీలు పచ్చడంబులు సంగతిఁగొనుశాలుజోడు సరిగంచుల మేల్
రంగగు దుప్పటు లన్నియు గొంగళి సరిపోలవన్న! గువ్వలచెన్నా!
।। 17 ।।
క. స్వాంతప్రవృత్తిఁ గార్యా నంతరమున మిత్రలక్షణంబు మద్యోహో
గాంతరమున బంధుత్వముఁ గొంతైనంతటన చూడు గువ్వలచెన్నా!
।। 18 ।।
క. పురుషుండు తటస్థించిన తరుణమునం దరుణిగుణముఁ దరుణిదనంతన్
దొరికినఁ బురుషుని గుణమును గురుబుద్ధీ! తెలియవలయు గువ్వలచెన్నా!
।। 19 ।।
క. కలిమిఁగల నాడె మనుజుఁడు విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా!
గలిమెంత యెల్లకాలము కులగిరులా కదలకుండ? గువ్వలచెన్నా!
।। 20 ।।
క. బుడ్డకు వెండ్రుకలున్నన్ గడ్డము కానట్లు కార్యకరణుల సభలన్
దొడ్డుగఁ జూతురె? తలపై గుడ్డలు బుట్టంత లున్న? గువ్వలచెన్నా!
।। 21 ।।
క. వనజకులులును శూద్రులు ననియెడి భేదంబు లేక యందఱు నొకరీ
తిని గొని యాచారాదుల గుణముల సరి నుందుమంద్రు గువ్వలచెన్నా!
।। 22 ।।
క. కలుఁద్రావి నంజుడుం దిను ఖలుసుతుఁడు వకీలె యైన ఘనమర్యాదల్
తెలియవు బ్రాహ్మణుఁడైనను కుపాంసనుఁ డనఁగఁదగును గువ్వలచెన్నా!
।। 23 ।।
క. వారిది వారిది ధనమొక కారణమున వచ్చిపడఁగఁ గన్నులుగన కె
వ్వారినిఁ దిరస్కరించును గోరెఁడు ధర్మంబు లేక గువ్వలచెన్నా!
।। 24 ।।
క. ఇలుఁగలఁడె? పరివ్రాజకుఁ డెలమింగొనునెట్లు వేశ్య? యీనివిటునెడన్
గులగాంత విత్తమడుగునె? కొలఁదిఁ గలదె ఱంకులాడి గువ్వలచెన్నా!
।। 25 ।।
క. ధన మతిగఁ గల్గి యున్నను దనయులుఁ దనయులును గల్గి తనరుచునున్నన్
ఘనలోభియు నిఱుపేదయు గుణముల సరియగుదు రెన్న గువ్వలచెన్నా!
।। 26 ।।
క. చండాల కులుఁ డొసగిన తండులముల బ్రతికినట్టి ధాత్రీ శకులుల్
నిండుతనం బెఱుఁగుదురే? కొండికలఁ జరింత్రు గాక గువ్వలచెన్నా!
।। 27 ।।
క. సిరిఁగలిగినంత బంధూ త్కరములలో నెవరురారు ద్రవ్యాసూయా
పరతాశాపరులయి పదుగురు చూచి హసింతు రంచు గువ్వలచెన్నా!
।। 28 ।।
క. సంపద గలిగిన మనుజుని కొంపకు బంధువులు కుప్పకుప్పలుగాఁగన్
సొంపుగ వత్తురు పేదకుఁ గుంపటు లన నుంద్రువారె గువ్వలచెన్నా!
।। 29 ।।
క. నీచునకు ధనము గల్గిన వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్
నీచ కృతి యగుచు మది సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా!
।। 30 ।।
క. అల్పునకు నెన్ని తెల్పినఁ బొల్పుగ నిల్వవవి పేడబొమ్మకు నెన్నో
శిల్పపుఁ బనులొనరించినఁ గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా!
।। 31 ।।
క. పిత్రాద్యైశ్వర్యముచేఁ బుత్రులుఁ బౌత్రులును ధర్మబుధ్ధిఁ జరింతుర్
చిత్రగతి నడుమఁ గల్గిన గోత్రంజిత్రగతిఁ దిరుగు గువ్వలచెన్నా!
।। 32 ।।